Ramcharan: మా మధ్య పోటీ ఎందుకు?: రామ్ చరణ్ కీలక వ్యాఖ్యలు

  • కలెక్షన్లు ప్రకటించే విషయంలో డిస్ట్రబెన్సెస్
  • హీరోల మధ్య పోటీ ఎందుకని అనిపిస్తుంటుంది?
  • మేము బాగానే ఉన్నా, అభిమానులు కొట్టుకుంటున్నారు

గత సంవత్సరం వేసవిలో 'రంగస్థలం', 'భరత్‌ అనే నేను', 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' చిత్రాలు విడుదలైన వేళ, కలెక్షన్ల విషయంలో చిన్న చిన్న డిస్ట్రబెన్సెస్ వచ్చాయని, ఇది అవసరమా? అని తనకు అనిపించిందని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వ్యాఖ్యానించారు. గురువారం నాడు తాను నటించిన 'వినయ విధేయ రామ' విడుదల కానున్న నేపథ్యంలో మీడియాతో చిట్ చాట్ చేశాడు చరణ్.

 హీరోల మధ్య పోటీ ఎందుకని తనకు అనిపిస్తుంటుందని, అందరమూ మంచి సినిమాలు చేస్తూ హ్యాపీగానే ఉన్నామని అన్నారు. నిర్మాతలకు డబ్బులు వస్తే చాలని, కలెక్షన్లు ప్రకటించుకునే విషయంలో పోటీ ఎందుకని ప్రశ్నించాడు. హీరోల మధ్య పోటీ లేదని, అభిమానులు మాత్రం ఎందుకు కొట్టుకుంటారో అర్థం కావడం లేదని, నిర్మాతల కన్నా ఫ్యాన్స్ ఈగర్ గా ఉంటారని అభిప్రాయపడ్డాడు.

 ఈ విషయంలో తాను చెప్పాల్సింది తాను చెప్పానని, కలెక్షన్ల గురించి వెల్లడించడంలో నిర్మాతలదే నిర్ణయమని అన్నాడు. ప్రతి సినిమా 'రంగస్థలం'లా రావాలంటే కష్టమని వ్యాఖ్యానించిన చెర్రీ, అటువంటి సినిమా చేసినప్పుడు మాత్రం తనపై తనకు నమ్మకం పెరుగుతుందని అన్నాడు. 'వినయ విధేయ రామ' చిత్రం కుటుంబ సమేతంగా చూసే చిత్రం అవుతుందని చెప్పాడు.

More Telugu News