Balakrishna: గౌతమీపుత్ర శాతకర్ణితో తల్లి రుణం తీర్చుకున్నా.. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’తో తండ్రి రుణం తీర్చుకుంటా!:బాలకృష్ణ

  • అక్టోబర్ లోనే రిలీజ్ చేయాలనుకున్నాం
  • కానీ జనవరి 9కి సినిమా వాయిదా పడింది
  • తిరుమలలో మీడియాతో మాట్లాడిన బాలయ్య

తన తండ్రి ఎన్టీఆర్ జీవితంపై తీసిన బయోపిక్ లో నటిస్తానని తాను ఎన్నడూ అనుకోలేదని ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ నటించిన పౌరాణిక, జానపద సినిమాల్లో నటించాలని కోరిక ఉండేదని వెల్లడించారు. వాటిలో కొన్నింటిని నెరవేర్చుకున్నానని పేర్కొన్నారు. రామారావు అనగానే ప్రతీ తెలుగువాడికి ఆయన మహానుభావుడని గుర్తుకు వస్తుందని పేర్కొన్నారు. ఈరోజు ఎన్టీఆర్ కథానాయకుడు చిత్ర యూనిట్ తో కలిసి బాలయ్య తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కేవలం తనకు తండ్రి మాత్రమే కాదనీ, ఆయన తన పాలిట గురువు, దైవం అని వ్యాఖ్యానించారు. ఆయన కుమారుడిగా పుట్టడం పూర్వజన్మ సుకృతమని తెలిపారు. ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితం, రాజకీయరంగ ప్రవేశంతో పాటు తెలియని కోణాలను సైతం ఆవిష్కరించే ప్రయత్నం చేశామని పేర్కొన్నారు.

గతేడాది అక్టోబర్ లోనే మొదటి భాగం ‘కథా నాయకుడు’ను రిలీజ్ చేయాలని అనుకున్నామని బాలయ్య చెప్పారు. కానీ ఎందుకో ఎన్టీఆర్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన జనవరి 9నే సినిమా రిలీజ్ కావాలని రాసిపెట్టి ఉందని అభిప్రాయపడ్డారు. గౌతమీపుత్ర శాతకర్ణి ద్వారా తల్లి రుణం, ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా తండ్రి రుణం తీర్చుకుంటానని పేర్కొన్నారు.

More Telugu News