Jagan: రేపటితో ముగియనున్న జగన్ పాదయాత్ర... ఆ వెంటనే తిరుమల యాత్ర!

  • 340 రోజులుగా సాగుతున్న యాత్ర
  • పూర్తయిన పైలాన్ నిర్మాణం
  • 10న తిరుమలకు వైఎస్ జగన్

340 రోజులుగా సాగుతున్న వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర బుధవారంతో ముగియనుండగా, ఈ అరుదైన క్షణాలను మరపురాని అనుభూతిగా మార్చుకునేందుకు వైకాపా నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సుందరమైన పైలాన్ నిర్మాణం పూర్తయింది. పైలాన్ పనులను వైసీపీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మాన ప్రసాదరావు తదితరులు దగ్గరుండి పర్యవేక్షించారు.

 రేపు సాయంత్రంతో పాదయాత్ర ముగియనుండగా, ఆపై జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు భారీ ఎత్తున జనసమీకరణ పనుల్లో శ్రీకాకుళం జిల్లా నేతలు నిమగ్నమై ఉన్నారు. ఇక బహిరంగ సభ ముగిసిన అనంతరం విశాఖ పట్నం చేరుకునే జగన్, అక్కడి నుంచి నేరుగా తిరుమలకు వెళతారు. 10వ తేదీన ఆయన కాలినడకన తిరుమలకు చేరుకుని స్వామిని దర్శించుకుంటారు. తిరుమల పర్యటన అనంతరం ఇడుపులపాయకు వెళ్లి, తన తండ్రి స్మారకం వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తారు.

More Telugu News