Uttar Pradesh: ప్రపంచంలోనే అతిపెద్ద తాత్కాలిక నగరం... కుంభమేళా కోసం రూ. 2 వేల కోట్లతో నిర్మించిన యూపీ సర్కారు!

  • 15 నుంచి యూపీలో కుంభమేళా
  • భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన యోగి సర్కారు
  • హాజరుకానున్న 12 కోట్ల మంది యాత్రికులు

మరికొన్ని రోజుల్లో కుంభమేళా ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్మించిన ప్రపంచంలోని అతిపెద్ద తాత్కాలిక నగరం, యాత్రికులు, భక్తులకు స్వాగతం పలికేందుకు ప్రయాగ్ రాజ్ (అలహాబాద్) లో సిద్ధమైంది. ఈ ఉత్సవాలకు కోట్లాది మంది హాజరుకానుండటంతో, యోగి ఆదిత్యనాథ్ సర్కారు రూ. 2,800 కోట్లను కేటాయించింది. ఇతర నిధులు, ఖర్చులు కూడా కలిపితే, కుంభమేళా నిర్వహణకు పెట్టబోయే ఖర్చు రూ. 4,300 కోట్లు దాటుతుందని అంచనా.

కాగా, దాదాపు 250 కిలోమీటర్ల పొడవైన రోడ్లు, 22 పంటూన్ వంతెనలు తాత్కాలిక నగరం కోసం ప్రభుత్వం నిర్మించింది. మొత్తం 40 వేల ఎల్ఈడీ బల్బులు ఈ నగరానికి కాంతులను అందించనున్నాయి. ఈ ఉత్సవాలకు భద్రతను కల్పించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇప్పటికే ప్రారంభమైంది. తాత్కాలిక నగరం మొత్తాన్ని సీసీటీవీ కెమెరాల నిఘాలో ఉంచారు.

ట్రాఫిక్ కు ఇబ్బందులు లేకుండా, భక్తులు నది వద్దకు చేరడం, ట్రాఫిక్ మళ్లింపులు తదితరాలను ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే పర్యవేక్షిస్తారు. మొత్తం 20 వేల మంది భద్రతా సిబ్బంది విధులను నిర్వర్తించనున్నారని ప్రభుత్వం వెల్లడించింది. కుంభమేళాలో భద్రతా విధులు నిర్వహించే పోలీసులు శాకాహారం మాత్రమే తీసుకుంటారని, మద్యం ముట్టబోరని యూపీ డీజీపీ కేపీ సింగ్ వ్యాఖ్యానించారు. జనవరి 15 నుంచి కుంభమేళా ప్రారంభం కానుండగా, 192 దేశాల నుంచి సుమారు 12 కోట్ల మంది వరకూ వస్తారని అంచనా.

More Telugu News