jana sena: భోగి పండగకు పవన్ కల్యాణ్ తెనాలి వస్తున్నారు: ‘జనసేన’ నేత నాదెండ్ల మనోహర్

  • ఈ నెల 13న పవన్ ఇక్కడికి వస్తున్నారు
  • పెదరావూరులోని మా పొలంలో భోగి మంటలేస్తాం
  • రైతులు, మహిళలు, యువతతో పవన్ భేటీ

సంక్రాంతి పండగ సందర్భంగా జనసేన పార్టీ అధినేత  పవన్ కల్యాణ్ తెనాలికి వస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్  ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, జనసేన సైనికులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ పవన్ ని ఘనంగా ఆహ్వానించాలని కోరారు. ఈ నెల 13వ తేదీ భోగి పండగ రోజంతా ఆయన ఇక్కడే గడుపుతారని, రైతులు, మహిళలు, యువతతో ఆయన సమావేశమవుతారని చెప్పారు. మన ప్రభుత్వం ఏర్పడితే భవిష్యత్తులో ఇక్కడ చేయాల్సిన కార్యక్రమాల గురించి, ప్రత్యేకంగా మహిళలు, రైతుల గురించి విశ్లేషించుకోవడానికి ఇది మంచి అవకాశమని చెప్పారు.పెదరావూరులోని తమ పొలంలో ప్రతి సంవత్సరం ఒక పండగ వాతావరణం తీసుకొచ్చే విధంగా భోగి మంటలు వేస్తూ ఉంటామని, ఈ ఏడాది కూడా ఆ కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించే పలు కార్యక్రమాలు పవన్ కోసం ఏర్పాటు చేశామని అన్నారు. ఈ అవకాశాన్ని తెనాలి ప్రజలందరూ చక్కగా వినియోగించుకోవాలని పార్టీ తరపున కోరుతున్నామని అన్నారు.

ఆ రోజున విజయవాడలోని జనసేన పార్టీ ఆఫీసు నుంచి బయలుదేరి నేరుగా ఇక్కడికి వస్తారని, నందివెలుగు వద్ద ఆయన్ని ఆహ్వానించి పెదరావూరుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. పవన్ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో తెలియజేస్తానని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. 

More Telugu News