Tollywood: సినిమా మాఫియాను షూట్ చేయాలన్న వల్లభనేని అశోక్.. తీవ్రంగా స్పందించిన నిర్మాత బన్నీ వాస్!

  • అశోక్ గ్రూపునకు చెందిన ప్రసన్నకు వార్నింగ్
  • సహనం కోల్పోయే పరిస్థితి తీసుకొస్తున్నారని వ్యాఖ్య
  • థియేటర్లు దొరక్కపోవడంతో తీవ్ర వ్యాఖ్యలు చేసిన వల్లభనేని అశోక్

టాలీవుడ్ నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ చిన్న సినిమాలను బతకనివ్వడం లేదని 'పేట' చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాత వల్లభనేని అశోక్ తాజాగా విమర్శించిన సంగతి తెలిసిందే. గ్యాంగ్ స్టర్ నయీమ్ ను కాల్చిచంపిన తరహాలో ఈ సినిమా మాఫియాను కూడా షూట్ చేయాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'పేట' సినిమా తెలుగు హక్కులను కొనుగోలు చేసిన అశోక్ కు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు దొరకలేదు. ఈ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా అశోక్ వ్యాఖ్యలపై మరో నిర్మాత బన్నీ వాస్ తీవ్రంగా స్పందించారు.

వల్లభనేని అశోక్ సన్నిహితుడైన నిర్మాత ప్రసన్నకుమార్ ను ఉద్దేశించి ఈరోజు ఫేస్ బుక్ లో స్పందిస్తూ ‘ప్రసన్న గారు.. తమరు తెలిసీ తెలియని మిడిమిడి జ్ఞానంతో మాటలు జారుతున్నారు. మేము సహనం కోల్పోయే పరిస్థితికి తీసుకొస్తున్నారు. తిట్టాలి అనుకుంటే మేము సంస్కారం అనే హద్దుని దాటడం మాత్రమే మిగిలింది’ అని ట్వీట్ చేశారు.

ఈనెల 9న బాలకృష్ణ నటించిన 'ఎన్టీఆర్ - కథానాయకుడు', 11న రామ్ చరణ్ 'వినయ విధేయ రామ'లు విడుదల కానున్నాయి. దీంతో 80 శాతానికి పైగా థియేటర్లలో ఈ రెండు సినిమాలే ఆడనున్నాయి. ఈ నేపథ్యంలో పేట సినిమాను జనవరి 10న రిలీజ్ చేసేందుకు వల్లభనేని అశోక్ ప్లాన్ చేసుకున్నారు. అయితే సినిమా విడుదలకు థియేటర్లు అందుబాటులో లేకుండా పోవడంతో మనస్తాపానికి లోనైన వల్లభనేని అశోక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

More Telugu News