Andhra Pradesh: చంద్రబాబు ఎక్కడ ప్రధాని అవుతారో అని మోదీకి భయం పట్టుకుంది!: ఏపీ మంత్రి నక్కా ఆనందబాబు

  • గతంలోనే ప్రధాని పదవిని బాబు తిరస్కరించారు
  • విపక్షాల ఏకీకరణను మోదీ తట్టుకోలేకపోతున్నారు
  • అవినీతిపై జగన్ మాట్లాడటం హాస్యాస్పదం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడ ప్రధాని అవుతారోనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భయం నెలకొందని ఏపీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. అందుకే చంద్రబాబును చూడగానే మోదీ ఉలిక్కిపడుతున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు విపక్షాలను కూడగట్టడాన్ని మోదీ తట్టుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో నక్కా ఆనందబాబు మాట్లాడారు.

చంద్రబాబుకు గతంలోనే ప్రధాని అవకాశం వచ్చినా తిరస్కరించారని మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. తనకు ప్రధాని పదవిపై మోజు లేదని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందితే గుజరాత్ కు నష్టమని మోదీ భయపడుతున్నారని విమర్శించారు.

ఏపీని కేంద్రం ఇబ్బంది పెట్టడాన్ని దేశమంతా చూస్తోందని ఆయన పేర్కొన్నారు. అవినీతిపై జగన్ మాట్లాడటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. జగన్ కోసమే కేంద్ర ప్రభుత్వం హైకోర్టు విభజన చేసిందని ఆరోపించారు. జగన్ పై ప్రస్తుతం ఎందుకు విచారణ సాగడం లేదని ఆయన ప్రశ్నించారు.

More Telugu News