ntr: ఎన్టీఆర్ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నా.. పోటీ గురించి ఆందోళన లేదు: రాం చరణ్

  • సంక్రాంతి రెండు భారీ చిత్రాలను ఆదరించగలదు
  • వారం రోజుల తర్వాత మరో సినిమాను బాక్సాఫీస్ వద్ద పెట్టవచ్చు
  • అన్ని సినిమాలు హిట్ అవుతాయనే నమ్మకం ఉంది

రాం చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ లో చరణ్ బిజీగా ఉన్నాడు. మరోవైపు, ఈ సంక్రాంతి బరిలో నాలుగు భారీ చిత్రాలు ఉండటం ఆసక్తిని రేపుతోంది. 9న బాలయ్య నటించిన 'కథానాయకుడు', 10న రజనీకాంత్ చిత్రం 'పేట', 11న 'వినయ విధేయ రామ', 12న వెంకటేష్, వరుణ్ తేజ్ లు నటించిన 'ఎఫ్2' విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో, బాక్సాఫీప్ వద్ద తీవ్ర పోటీ నెలకొంది.

ఈ నేపథ్యంలో చరణ్ స్పందిస్తూ, రెండు భారీ చిత్రాలను సంక్రాంతి సీజన్ ఆకామడేట్ చేయగలదని... వారం రోజుల తర్వాత బాక్సాఫీస్ వద్ద మరో చిత్రాన్ని కూడా పెట్టవచ్చని తెలిపాడు. ఈ సంక్రాంతి పోటీ గురించి తాను ఆందోళన చెందడం లేదని... అన్ని సినిమాలు హిట్ అవుతాయనే విశ్వాసం తనకు ఉందని చెప్పాడు.

బాలయ్య నటించిన 'కథానాయకుడు' సినిమాపై చరణ్ మాట్లాడుతూ... ఎంతో గౌరవనీయమైన చిత్రమని అన్నాడు. ఎన్టీఆర్ పై ఎంతో గౌరవంతో ఆ చిత్రాన్ని తెరకెక్కించారని చెప్పాడు. ప్రతి ఒక్కరూ సినిమా కోసం ఎదురుచూసేలా బయోపిక్ ను దర్శకుడు క్రిష్ అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసించాడు. 'కథానాయకుడు' సినిమా కోసం తాను కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని చెప్పాడు.

వెంకటేష్, వరుణ్ తేజ్ లు నటించిన 'ఎప్2' మూవీ సూపర్ హిట్ అవుతుందని చరణ్ తెలిపాడు. వెంకీగారిలా మరెవరూ కామెడీ చేయలేరని... కుటుంబాలను ఆకట్టుకునేలా ఆయన చిత్రాలు ఉంటాయని చెప్పాడు. వెంకటేష్ పక్కన తన సోదరుడు వరుణ్ ఎలా చేశాడో వేచి చూడాలని అన్నాడు.

More Telugu News