Telangana: ఖమ్మం జిల్లాలో ఓటమితో ముఖ్యమంత్రి కేసీఆర్ గుండెల్లో బాధ నెలకొంది!: తుమ్మల ఆవేదన

  • స్వార్థరాజకీయాలు, కుట్రలతో ఓడిపోయాం
  • ఇకపై జరగాల్సిన విషయాన్ని చూడండి
  • అశ్వారావుపేటలో మీడియాతో మాట్లాడిన నేత

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. స్వార్థ రాజకీయాలు, కొన్ని కుట్రల వల్లే ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ నష్టపోయిందని తుమ్మల తెలిపారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో పార్టీ ఓటమికి తానే బాధ్యత వహిస్తున్నానని అన్నారు. ఈ ఓటమితో తమతో పాటు సీఎం కేసీఆర్ గుండెల్లో సైతం బాధ నెలకొందని పేర్కొన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోని వినాయకపురం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

రాజకీయంగా తనకు జన్మనిచ్చిన సత్తుపల్లిలో గెలుస్తామని ఆశపడ్డామని తుమ్మల తెలిపారు. అశ్వారావుపేట అసలు గెలవాల్సిన స్థానమనీ, ఇలాంటి చోట స్వార్థ రాజకీయాలతో ఓటమి పాలవడం బాధ కలిగించిందని వ్యాఖ్యానించారు. ఇప్పటిదాకా జరిగింది మనసులో పెట్టుకోకుండా జరగాల్సింది చూడాలని కార్యకర్తలకు సూచించారు.

ఖమ్మం జిల్లాకు కేసీఆర్ చాలా ప్రాధాన్యత ఇచ్చారనీ, 800 మెగావాట్లతో కేటీపీఎస్‌ను, 1200 మెగావాట్లతో భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ను కేటాయించారని గుర్తుచేశారు. ఈ రెండు యూనిట్ల నిర్మాణం ఇప్పటికే తుదిదశకు చేరుకున్నాయని తెలిపారు. రాబోయే పంచాయతీ ఎన్నికలకు గ్రామ నాయకులంతా ఏకమై సర్పంచ్ అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలని సూచించారు.

More Telugu News