Telangana: హైదరాబాద్ లో మళ్లీ చైన్ స్నాచర్ల కలకలం.. దొంగను పట్టుకుని చావగొట్టిన మహిళ!

  • చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
  • బైక్ నుంచి కిందపడిపోయిన దొంగ
  • చావబాది పోలీసులకు అప్పగించిన కుటుంబసభ్యులు

తెలంగాణలోని హైదరాబాద్ లో మరోసారి చైన్ స్నాచర్ల కలకలం చెలరేగింది. నగరంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు దుండగులు ఈరోజు ఉదయం ఓ మహిళ మెడ నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు యత్నించారు. దీంతో బాధితురాలు చైన్ ను గట్టిగా పట్టుకోవడంతో రెండో వ్యక్తి కిందపడిపోయాడు. ఈ సందర్భంగా బాధిత మహిళ కేకలు వేయడంతో అక్కడకు చేరుకున్న కుటుంబ సభ్యులు సదరు దొంగను చితకబాదారు.

అనంతరం పోలీసులకు అప్పగించారు. కాగా, ఈ ఘటనలో బైక్ నడుపుతున్న రెండో వ్యక్తి ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. ఈ నేపథ్యంలో పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇటీవల 12 గంటల వ్యవధిలో 10 స్నాచింగ్ లతో దొంగలు హైదరాబాద్ ను హడలెత్తించిన సంగతి తెలిసిందే.

More Telugu News