Peta: అల్లు అరవింద్, దిల్ రాజులను షూట్ చేయండి: వల్లభనేని అశోక్ సంచలన వ్యాఖ్యలు

  • చిన్న సినిమాలను బతకనివ్వడం లేదు
  • థియేటర్లను గుప్పిట్లో పెట్టుకున్నారు
  • తీవ్ర భావోద్వేగానికి గురైన వల్లభనేని అశోక్

ఏదైనా పెద్ద సినిమా విడుదలవుతుంటే, చిన్న సినిమాలను బతకనివ్వడం లేదని, నయీమ్ వంటి గ్యాంగ్ స్టర్ ను ఎన్ కౌంటర్ చేసి చంపిన తెలంగాణ ప్రభుత్వం, అల్లు అరవింద్, దిల్ రాజు వంటి థియేటర్ మాఫియాను కూడా షూట్ చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ తాజా చిత్రం 'పేటను'ను తెలుగులో విడుదల చేస్తున్న వల్లభనేని అశోక్, 10వ తేదీన చిత్రం రిలీజ్ ను ప్లాన్ చేసుకోగా, ఆయనకు థియేటర్ల కొరత ఏర్పడింది. 9న బాలకృష్ణ 'ఎన్టీఆర్ - కథానాయకుడు', 11న రామ్ చరణ్ 'వినయ విధేయ రామ'లు విడుదలవుతుండటంతో 80 శాతానికి పైగా థియేటర్లలో ఈ రెండు సినిమాలే ఆడనున్నాయి.

ఆపై వెంకటేశ్, వరుణ్ తేజ్ నటించిన మల్టీస్టారర్ 'ఎఫ్-2' రానుంది. ఇదే సమయంలో అజిత్ 'విశ్వాసం' కూడా రానుంది. దీంతో 'పేట'కు థియేటర్లే లభించడం లేదు. రెండు మూడు థియేటర్లు ఉన్న సీ-సెంటర్లలో పేట విడుదలకే నోచుకోని పరిస్థితి. 10 నుంచి 15 వరకూ థియేటర్లు ఉన్న పట్టణాల్లో కనీసం ఒక థియేటర్ అయినా దక్కుతుందో లేదోనన్న ఆందోళనలో వల్లభనేని అశోక్ ఉన్నారు.

ఈ నేపథ్యంలో తీవ్ర భావోద్వేగానికి గురైన ఆయన, అల్లు అరవింద్, దిల్ రాజులు థియేటర్లను గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు. వాళ్ల వల్ల చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయని వాపోయారు. థియేటర్ మాఫియాను నడుపుతున్న కుక్కలకు బుద్ధి చెప్పాలని, తక్షణం స్పందించి తమ చిత్రానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

More Telugu News