Andhra Pradesh: చంద్రబాబు పనిచేయకుండా పబ్లిసిటీతో గడిపేస్తున్నారు.. ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తారు!: తలసాని

  • రాబోయే 4 నెలల్లో దేశ ముఖచిత్రం మారుతుంది
  • ఫెడరల్ ఫ్రంట్ కీలకంగా మారబోతోంది
  • తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న నేత

రాబోయే నాలుగు నెలల్లో దేశ రాజకీయాల ముఖచిత్రం మారబోతోందని టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంట్ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతోందని జోస్యం చెప్పారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన తీరు సరిగ్గా లేదని ఆయన దుయ్యబట్టారు. ఈ రోజు తెల్లవారుజామున తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తలసాని మీడియాతో మాట్లాడారు.

ఏపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ తరహాలో దీక్షలకు కూర్చుంటోందని ఈ సందర్భంగా తలసాని శ్రీనివాసయాదవ్ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ సిద్ధాంతాలను పక్కనపెట్టి కాంగ్రెస్ వెంట పడుతోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీ సీఎం చంద్రబాబు పనిచేయకుండా పబ్లిసిటీతో గడిపేస్తున్నారని విమర్శించారు. ఇరు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలని కేసీఆర్ కోరుకుంటున్నారని తలసాని తెలిపారు. ఏపీ రాజకీయాల్లోనూ కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తారని జోస్యం చెప్పారు.

More Telugu News