Nikita: ఒడిశా యువ నటి నికిత మృతి!

  • టెర్రస్ పైనుంచి పడి తీవ్ర గాయాలు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • నటికి ఆరు నెలల కుమార్తె

నికితగా చిరపరిచితురాలైన ఒడిశా టెలివిజన్ నటి లక్ష్మీప్రియ బెహరా మృతి చెందింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. మహానది విహార్ ప్రాంతంలో ఉన్న తన తండ్రి ఇంటికి వెళ్లిన నికిత ప్రమాదవశాత్తు టెర్రస్ పైనుంచి కిందపడింది. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. తీవ్ర గాయాల వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు నికిత తల్లిదండ్రులు, భర్త తెలిపారు. అయితే, టెర్రస్ పైనుంచి ఎలా కిందపడిందన్న విషయాలు తెలియరాలేదు.

 కిందపడి తీవ్ర గాయాలపాలైన నికితను తొలుత ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం కటక్‌లోని ఎస్‌సీబీ ఆసుపత్రికి తరలించారు. అక్కడామె పరిస్థితి మరింత విషమించడంతో మరోమారు ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడామె చికిత్స పొందుతూ మరణించింది.  

‘చోరీ చోరీ మానా చోరీ’, ‘మా రా పనతకాని’, ‘స్మైల్ ప్లీజ్’ వంటి సినిమాల్లోనూ నికిత నటించింది. ఆమెకు 2016లో గోపాల్‌పూర్‌కు చెందిన లిపన్ సాహుతో కటక్‌లో వివాహమైంది. వీరికి ఆరు నెలల కుమార్తె ఉంది. అయితే, ఇటీవల ఆమె తన భర్తకు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది.

More Telugu News