narendra modi: గుజరాత్ కి మాత్రమే పీఎంలా మోదీ వ్యవహరిస్తున్నారు: కేఈ కృష్ణమూర్తి

  • మోదీని ప్రధాని పదవి నుంచి దించడమే మా ధ్యేయం
  • ఇందుకోసమే మహాకూటమి ప్రయత్నాలు చేస్తోంది
  • వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం

దేశానికి కాకుండా గుజరాత్ కి మాత్రమే పీఎంలా మోదీ వ్యవహరిస్తున్నారని ఏపీ మంత్రి కేఈ కృష్ణమూర్తి విమర్శించారు. మోదీని ప్రధాని పదవి నుంచి దించడమే తమ ధ్యేయమని, ఇందుకోసమే చంద్రబాబు మహాకూటమి ప్రయత్నాలు చేస్తున్నారని మరోసారి స్పష్టం చేశారు. దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని అభిప్రాయపడ్డారు.

 పోలవరం ప్రాజెక్ట్ కు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్లు ఖర్చు చేసిందని, పోలవరానికి కేంద్రం రూ.6 వేల కోట్లు మాత్రమే ఇచ్చిందని, విభజన చట్టం హామీలనే అమలు చేయమని అడుగుతున్నామని అన్నారు. ఎన్టీఆర్ కూడా డిల్లీ పెత్తనం మీదే ఎదురుతిరిగారని, న్యాయమైన హక్కులడిగితే అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. బీజేపీయేతర కూటమిని దెబ్బతీసేందుకే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారని, ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఓట్లు చీల్చడానికి కేసీఆర్ యత్నిస్తున్నారని, జగన్ కేసుల నుంచి ఉపశమనం కోసమే బీజేపీతో దోస్తీ కడుతున్నారని ఆరోపించారు.

More Telugu News