Balakrishna: ఆ స్థితికి నేను ఎన్నడూ దిగజారను: నందమూరి బాలకృష్ణ

  • 'ఎన్టీఆర్'పై లాభనష్టాలు చూడటం లేదు
  • వ్యక్తిగత, సొంత విషయాలు పక్కనబెట్టాం
  • మిగతా బయోపిక్ ల గురించి మాట్లాడబోను

లాభ నష్టాలను బేరీజు వేసుకుని తాను 'ఎన్టీఆర్' బయోపిక్ ను తీయలేదని నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పేరును చిరస్థాయిగా నిలపాలన్నదే తన లక్ష్యమని, అందుకే ఈ సినిమాను నిర్మించాలని నిర్ణయించుకున్నానని అన్నారు. బయోపిక్ లో వ్యక్తిగత విషయాలను, సొంత విషయాలను పక్కన పెట్టి చూడాలని, కానీ కొంతమంది వాటిని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని, తాను ఆ స్థితికి దిగజారబోనని అన్నారు. కొంతమంది తమ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తూ, ఎన్టీఆర్ పై బయోపిక్ ల పేరుతో వస్తున్నారని, వారి గురించి తాను మాట్లాడబోనని, లోకం తీరు అలాగే ఉంటుందని చెప్పారు.

తన గురించి కూడా రకరకాల ప్రచారాలు జరుగుతుంటాయని, ఓ అభిమానిపై చేయి చేసుకున్నానని అంటారని గుర్తు చేసిన బాలయ్య, తాను వెళ్లింది ఎక్కడికో, ఎందుకో తెలుసుకుని అభిమానులు ప్రవర్తించాలని అన్నారు. అభిమానులతో కలసి తానిచ్చినన్ని ఫొటోలు మరే హీరో కూడా ఇచ్చివుండరని, తనను చూసేందుకు అప్పు చేసి మరీ ఎక్కడి నుంచో వచ్చే అభిమానులు, జీవితాంతం గుర్తుంచుకునే తీపి జ్ఞాపకంలా ఓ ఫొటో ఇవ్వాలని తానూ భావిస్తానని బాలకృష్ణ చెప్పారు.

More Telugu News