Narendra Modi: రుణమాఫీ కంటే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం బెటర్ కదా?: మోదీ

  • గత ప్రభుత్వం ఎడాపెడా రుణాలిచ్చింది
  • ఇప్పుడు మాఫీ పేరుతో డ్రామా మొదలెట్టింది
  • ‘కోయిల్’ అనేది ఏంటో రాహుల్‌కు తెలియదు

రైతు రుణాలను మాఫీ చేయడం కంటే పెండింగ్‌లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తిచేయడం మంచిదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. శనివారం ఒడిశాలో ఆరు ఇరిగేషన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాని అనంతరం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రైతు రుణాలను మాఫీ చేయడం కంటే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసేందుకే తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం  రైతులకు ఎడాపెడా రుణాలు ఇచ్చిందని, ఇప్పుడు మాఫీ అంటూ కొత్త నాటకం మొదలుపెట్టిందని ఆరోపించారు.

తాను 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు పలు నీటిపారుదల ప్రాజెక్టులు 30-40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నట్టు గుర్తించామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక 99 పెండింగ్ ప్రాజెక్టుల పనులను రూ. 90 వేల కోట్ల ఖర్చుతో తిరిగి ప్రారంభించినట్టు పేర్కొన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా రైతు సాధికారత పెంచుతామని  మోదీ పేర్కొన్నారు.

నార్త్ కోయిల్ ఇరిగేషన్ ప్రాజెక్టును  మోదీ ప్రస్తావిస్తూ రైతుల గురించి విపరీతంగా ఆందోళన చెందుతున్న వారికి (రాహుల్) ‘కోయిల్’ అంటే ఏమిటో తెలియదని పేర్కొన్నారు.  కోయిల్ అనేది పక్షిపేరో, లేక ఇంకేంటో తెలియక సందిగ్ధంలో ఉన్నారని రాహుల్‌ గాంధీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు.

More Telugu News