NTR: దర్శకుడిగా తొలుత తేజ, ఆపై క్రిష్... కారణం చెప్పిన బాలకృష్ణ!

  • ఇంత బరువును మోయలేనని తేజ చెప్పాడు
  • ముంబైలో క్రిష్ కలిసి తాను చేస్తానని అన్నాడు
  • తాను చేసినా ఇంత బాగా వచ్చుండేది కాదన్న బాలయ్య

'ఎన్టీఆర్' చిత్రానికి దర్శకుడుగా తొలుత తేజని తీసుకున్న బాలకృష్ణ, ఆపై ఆయన స్థానంలో క్రిష్ తో సినిమాను కొనసాగించిన సంగతి తెలిసిందే. ఇక ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వెల్లడించారు నటుడు బాలకృష్ణ. తాము తొలుత తేజను అనుకుని షూటింగ్ ను మొదలు పెట్టామని, కానీ, ఇంత బరువును తాను మోయలేనని సతమతమయ్యాడని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని విద్యాబాలన్ కు చెప్పేందుకు ముంబైకి వెళ్లిన వేళ, 'మణికర్ణిక' షూటింగ్ లో భాగంగా అక్కడే వున్న క్రిష్ తన వద్దకు వచ్చాడని గుర్తు చేసుకున్నారు.

 ఆ సమయంలో 'బాబూ నేను డైరెక్ట్‌ చేయనా?' అని క్రిష్ అడిగాడని, ఆపై రెండు నిమిషాల్లోనే తాను నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. క్రిష్ కు తెలుగు సాహిత్యం బాగా తెలుసునని, బయోగ్రఫీలు ఎన్నో చదివిన అనుభవం ఉందని అన్నారు. క్రిష్ తన సినిమాకు న్యాయం చేస్తాడనిపించే తీసుకున్నానని అన్నారు. తేజ తరువాత చిత్రానికి తానే దర్శకత్వం వహిద్దామని అనుకున్నానని, తాను దర్శకత్వం చేసుంటే సినిమా ఇంత బాగా వచ్చుండేది కాదని బాలకృష్ణ అన్నారు.

More Telugu News