YSRCP: ఈసారి కూడా ఎవరితోనూ పొత్తు పెట్టుకోం..మాకు ప్రజలపై నమ్మకం ఉంది: వైఎస్ జగన్

  • గత ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు
  • ఏపీకి హోదా ఇస్తామని చాలా మంది మోసం చేశారు
  • ఏపీకి జరిగిన అన్యాయంలో బాబు, పవన్, బీజేపీ పాత్ర ఉంది

గత ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదని, వచ్చే ఎన్నికల్లో కూడా తాము ఒంటరిగానే పోటీ చేస్తామని వైసీపీ అధినేత జగన్ స్పష్టం చేశారు. ‘సాక్షి’ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈసారి కూడా ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని, ప్రజలపై, దేవుడి పైనా తమకు నమ్మకం ఉందని చెప్పారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై ఆయన విమర్శలు చేశారు. ఏపీకి జరిగిన అన్యాయంలో చంద్రబాబు, పవన్, బీజేపీ ఈ ముగ్గురికి పాత్ర ఉందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి చాలా మంది మోసం చేశారని, మోదీ, పవన్ కూడా అదే పని చేశారని విమర్శించారు. ఏపీ ప్రజలు మరోసారి నమ్మి మోసపోయే పరిస్థితిలో లేరని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలోని ఎంపీ స్థానాలన్నింటిలో వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  

More Telugu News