air: ఇక మూగబోనున్న ఆకాశవాణి జాతీయ ఛానల్!

  • నిర్వహణ వ్యయం తగ్గింపులో భాగంగా మూసివేత
  • ఉత్తర్వులు జారీచేసిన ప్రసారభారతి
  • ఐదు నగరాల్లో శిక్షణ కేంద్రాలు సైతం క్లోజ్

ప్రసారాల హేతుబద్ధీకరణ, నిర్వహణ వ్యయం తగ్గింపులో భాగంగా ప్రభుత్వ రంగ ఆలిండియా రేడియో (ఏఐఆర్) జాతీయ ఛానల్ ను మూసివేయాలని ప్రసారభారతి నిర్ణయించింది. ఉన్నతాధికారులతో పలుమార్లు చర్చలు, సంప్రదింపులు జరిపిన అనంతరం  ప్రసారభారతి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని గత నెల 24న ఎఐఆర్‌ డైరెక్టరేట్‌కు తెలియజేసింది.

దీంతో ఆల్‌ ఇండియా రేడియో డైరెక్టర్‌ జనరల్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని వెంటనే అమలు చేయాలని ఆలిండియా రేడియోను ఆదేశించారు. అలాగే అకాడమీస్ ఆఫ్ బ్రాడ్ కాస్టింగ్ అండ్ మల్టీ మీడియాను కూడా మూసివేయాలని ప్రసారభారతి నిర్ణయించింది. ఇదే కోవలో అహ్మదాబాద్‌, హైదరాబాద్, లక్నో, షిల్లాంగ్, తిరువనంతపురం నగరాల్లోని ప్రాంతీయ శిక్షణా అకాడమీలను  రద్దు చేయనుంది. ఇది తక్షణమే అమల్లోకి రానుంది. తోడాపూర్‌, నాగపూర్‌ సహా ఇతర నగరాల్లోని  సిబ్బందిని  వేరే ప్రాంతాల్లోని ఆఫీసుల్లో సర్దుబాటు చేయనుంది.

ఈ విషయమై ఏఐఆర్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. జాతీయ ఛానల్‌కు సంబంధించిన ట్రాన్స్‌మీటర్లు బలహీనంగా ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఛానల్ కు అందుబాటులో ఉన్న ట్రాన్స్ మీటర్లలో నాగపూర్‌లోని ట్రాన్స్‌మీటర్ మాత్రమే ఒక్క మెగావాట్‌ సామర్థ్యాన్ని కలిగి ఉందనీ, ప్రస్తుత డిజిటల్‌ రేడియో యుగంలో ఇది సరిపోదని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం కొన్ని ఏఐఆర్‌ కార్యక్రమాలను అవుట్‌సోర్స్‌ ద్వారా నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా ఏఐఆర్‌ వెబ్‌సైట్‌ను ప్రైవేటు వ్యక్తుల ద్వారా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. 1987లో ప్రారంభమైన ఎయిర్ ఇండియా జాతీయ ఛానల్ రోజూ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ నిరంతరాయంగా పనిచేసింది.

More Telugu News