Andhra Pradesh: 9 నెలల చంటిబిడ్డ ఉన్న మహిళను అర్ధరాత్రి వరకూ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు!: చంద్రబాబుపై బీజేపీ ఆగ్రహం

  • సీఎం హెచ్చరించిన 24 గంటల్లోనే దాడి జరిగింది
  • చింతమనేని స్థాయికి బాబు ఎదిగిపోయారు
  • సీఎంపై విమర్శలు గుప్పించిన బీజేపీ నేత

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కాన్వాయ్ ను బీజేపీ నేతలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఈరోజు గుంటూరులోని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఇంటి ముందు టీడీపీ శ్రేణులు అందోళనకు దిగిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. తాజాగా ఈ వ్యవహారంపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బెదిరించిన 24 గంటల్లోనే కన్నా ఇంటిపై దాడి జరిగిందని తెలిపారు. టీడీపీ గూండాలు కన్నా ఇంటిపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇలాంటి రౌడీ రాజకీయాలు చేసేవారు కాలగర్భంలో కలిసిపోతారని వ్యాఖ్యానించారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

చంద్రబాబును ప్రశ్నించినందుకు బీజేపీ కార్పొరేటర్ ప్రసన్నను పోలీసులు అరెస్ట్ చేశారని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. 9 నెలల చంటిబిడ్డ ఉన్న మహిళను అర్ధరాత్రి వరకూ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘అంతు చూస్తా.. ఫినిష్ చేస్తా’ అనే భాషను సీఎం వాడారని గుర్తుచేశారు. చింతమనేని, బుద్ధా వెంకన్న, జేసీ స్థాయికి చంద్రబాబు ఇప్పుడు ఎదిగారని ఎద్దేవా చేశారు. కన్నా ఇంటిపై దాడి వ్యవహారంలో జాతీయ మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.

More Telugu News