Andhra Pradesh: ఎయిర్ పోర్టులో జగన్ ను చంపేస్తే మనకు సంబంధం ఉండదనుకుని చంద్రబాబు కుట్ర పన్నారు!: రోజా

  • చంద్రబాబు హిట్లర్ లా ప్రవర్తిస్తున్నారు
  • జగన్ పై దాడిని కేంద్ర పరిధిలోకి నెట్టేందుకు ప్లాన్
  • శివాజీని ఎందుకు విచారించలేదు?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ హిట్లర్ లా ప్రవర్తిస్తున్నారని వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ‘ఇలాంటి ముఖ్యమంత్రినా మనం ఎన్నుకున్నది’ అని ప్రజలు బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. కాకినాడలో ఓ మహిళను ఫినిష్ చేస్తాను అంటూ చంద్రబాబు హెచ్చరించారని గుర్తుచేశారు. ‘కేంద్రం పరిధిలోని విమానాశ్రయంలో జగన్ ను చంపేస్తే మనకు సంబంధం ఉండదు’ అని చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు. హైదరాబాద్ లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో రోజా మాట్లాడారు.

ఇప్పుడు కేసు విచారణను ఎన్ఐఏ చేపట్టగానే చంద్రబాబు నాయుడు, పప్పు నాయుడు ఎందుకు బాధపడుతున్నారని రోజా ప్రశ్నించారు. ఎన్ఐఏ విచారణ ప్రారంభిస్తే అసలు నిప్పు నాయుడు, పప్పు నాయుడు తప్పు చేశారా? లేదా? అని తేలిపోతుందని స్పష్టం చేశారు. ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో సినిమాలు లేని ఓ నటుడు శివాజీతో స్టోరీలు చెప్పించారని వ్యాఖ్యానించారు.

ఇప్పటివరకూ శివాజీని అరెస్ట్ చేసి విచారించకపోవడాన్ని బట్టి ఈ దాడి వెనక ఎవరు ఉన్నారో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. అందుకే ఎన్ఐఏకు విచారణ అప్పగించగానే గిలగిలా కొట్టుకుంటున్నారని దుయ్యబట్టారు. కేంద్రంపై ఇక సమరమే అని ఇక్కడ చెప్పి, ఆ తర్వాత నీతి అయోగ్ సమావేశంలో మోదీకి చంద్రబాబు వంగివంగి దండాలు పెట్టలేదా? అని ఆమె ప్రశ్నించారు. అలాంటి చంద్రబాబు.. వైసీపీ అధినేత జగన్ ను విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News