kanna lakshminarayana: గతంలో అమిత్ షా, పవన్, జగన్ లపై హత్యాయత్నం జరిగింది.. ఈరోజు నాపై జరిగింది: కన్నా లక్ష్మీనారాయణ

  • ఫినిష్ చేస్తానంటూ ఓ మహిళకు సీఎం వార్నింగ్ ఇచ్చారు
  • బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు
  • చంద్రబాబు, లోకేష్ ల ఆదేశాలతో నన్ను చంపేందుకు యత్నిస్తున్నారు

బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ కుట్ర పన్నారని ఆరోపించారు. గుంటూరులోని కన్నా నివాసాన్ని ముట్టడించేందుకు ఈరోజు టీడీపీ కార్యకర్తలు యత్నించారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులతో కన్నా కుమారుడు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో, టీడీపీ-బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ఈ ఘటన అనంతరం కన్నా మాట్లాడుతూ, నిన్న కాకినాడ పర్యటనలో చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చేందుకు తమ పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారని చెప్పారు. వారి విన్నపాలను ముఖ్యమంత్రి పట్టించుకోకపోగా... బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. నడిరోడ్డు మీదే ఓ మహిళను ఫినిష్ చేస్తానంటూ సీఎం వార్నింగ్ ఇచ్చారని అన్నారు. చంద్రబాబు, లోకేష్ ల ఆదేశాల మేరకే తనను చంపేందుకు టీడీపీ శ్రేణులు యత్నిస్తున్నాయని చెప్పారు. ఈ విషయంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, జనసేనాని పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత జగన్ లపై హత్యాయత్నం జరిగిందని... ఇప్పుడు తనపై జరిగిందని చెప్పారు. ఈ ఘటనలపై గవర్నర్ నరసింహన్ దృష్టి సారించాలని... రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాలని కోరారు. 

More Telugu News