electrical buses: హైదరాబాద్‌ రోడ్లపై తిరుగుతూ ట్రయిల్ వేస్తున్న విద్యుత్‌ ఆధారిత బస్సులు!

  • ట్రయిల్‌ రన్‌ ప్రారంభించిన టీఎస్‌ ఆర్టీసీ
  • వంద బస్సులు నడిపేందుకు ఓ ప్రైవేటు సంస్థతో ఒప్పందం
  • తొలివిడత అందుబాటులోకి రానున్న 40 బస్సులు

పర్యావరణ హితమైన విద్యుత్‌ ఆధారిత బస్సులు హైదరాబాద్‌లో త్వరలో సేవలు అందించనున్నాయి. శబ్ద, వాయు కాలుష్యం లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో మహా నగరంలో వంద ఎలక్ట్రికల్‌ బస్సులు నడపాలని టీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది. ఇందుకుగాను ఓ ప్రైవేటు సంస్థతో ఒప్పందం కుదుర్చుకోగా తొలివిడత 40 బస్సులను నడిపేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది.

ప్రస్తుతం ఈ బస్సులు ట్రయిల్ రన్‌తో శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు రోడ్డులో దూసుకు పోతున్నాయి. నలభై బస్సుల్లో 20 మియాపూర్‌-2కు, 20 కంటోన్మెంట్‌ డిపోకు కేటాయించారు.  ఈ బస్సులకు అవసరమైన చార్జింగ్‌ కోసం రెండు డిపోల్లో అవసరమైన కేంద్రాలను ఏర్పాటు చేశారు. బస్సు కండిషన్‌,  డ్రైవర్లకు అవగాహన ఏర్పరిచేందుకు ట్రయిల్‌ రన్‌ చేస్తున్నారు.

విద్యుత్‌ ఆధారిత బస్సులు రోడ్లపై పరుగులు తీస్తుంటే హైదరాబాద్‌ వాసులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ బస్సులు నడిపే డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ అందించడంతో పాటు అవసరమైన వైద్య పరీక్షలను కూడా ఆర్టీసీ ఇప్పటికే పూర్తి చేసింది. ఉన్నతాధికారుల నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వస్తే సంక్రాంతి నుంచి ఈ బస్సులు ప్రయాణికులకు సేవలందించనున్నాయని అధికారులు తెలిపారు. సాధారణ బస్సు చార్జీలనే వీటికి వసూలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టుకు కనెక్టివిటీ కోసం ఈ బస్సులను వినియోగించనున్నారు.

More Telugu News