Chandrababu: చంద్రబాబు దావోస్ పర్యటనకు గ్రీన్ సిగ్నల్.. ఆంక్షల సడలింపు!

  • తొలుత చంద్రబాబు పర్యటనపై ఆంక్షలు
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు
  • వెనక్కి తగ్గిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి దావోస్ పర్యటనపై కేంద్రం దిగివచ్చింది. ఆయన పర్యటనపై విధించిన ఆంక్షలను ఎత్తివేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దావోస్‌లో ప్రతి ఏడాది జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు సీఎం చంద్రబాబు 14-15 మందితో కలిసి వెళ్తుంటారు. ఈసారి కూడా ఈ నెల 20 నుంచి 26 వరకు ఏడు రోజులపాటు దావోస్‌లో పర్యటించేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రం అనుమతి కోరింది.

చంద్రబాబు దావోస్ పర్యటనకు కేంద్రం అనుమతి ఇస్తూనే ఆంక్షలు విధించింది. పర్యటనను నాలుగు రోజులకు కుదించుకోవాలని, ఐదుగురే వెళ్లాలని తేల్చి చెప్పింది. దీంతో చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోమారు దరఖాస్తు చేయాలంటూ సీఎంవోను ఆదేశించారు. ఏపీ నిరసనతో మనసు మార్చుకున్న కేంద్రం చంద్రబాబు తన బృందంతో కలిసి దావోస్‌లో పర్యటించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే పర్యటనను నాలుగు రోజులకు కుదించింది.

More Telugu News