Andhra Pradesh: ఉద్యోగాల భర్తీకి ఈ నెలాఖరులోపు మరో 14 నోటిఫికేషన్లు: ఏపీపీఎస్సీ చైర్మన్

  • మరో 1500 ఉద్యోగాల భర్తీ  
  • ఇప్పటికే మొత్తం 21 నోటిఫికేషన్లు ఇచ్చాం
  • తద్వారా 3,250 ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టాం

ఈ నెలాఖరులోపు మరో 14 నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉందని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ వెల్లడించారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ నెలాఖరులోపు మరో 1500 ఉద్యోగాల భర్తీ నిమిత్తం పద్నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా గత ఏడాది సెప్టెంబర్ లో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు డిసెంబర్ 31 లోపు నోటిఫికేషన్లు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.

మొత్తం 21 నోటిఫికేషన్ల ద్వారా 3,250 ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టామని, ఈ నోటిఫికేషన్లలోనే స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ పరీక్షల తేదీలు, ఆయా ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలను క్యారీ ఫార్వర్డ్ పోస్టుల వివరాలతో పొందుపరిచామని చెప్పారు. చివరి నిమిషంలో అభ్యర్థులు దరఖాస్తులు పంపుతుండటం వల్ల సర్వర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని, వీలైనంత త్వరగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులకు ఎక్కువగా ఓటీపీఆర్ సంబంధిత ఇబ్బందులే వస్తున్నాయని, వారికి ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించేందుకు ‘హెల్ప్ లైన్’ ఏర్పాటు చేసినట్టు చెప్పారు.    

More Telugu News