Sachin Tendulkar: ఆ అగౌరవానికి నిరసనగా.. ప్రభుత్వ కార్యక్రమాలన్నింటికీ దూరంగా ఉండండి: సచిన్ కు శివసేన సూచన

  • బుధవారం నాడు తుదిశ్వాస విడిచిన సచిన్ కోచ్ అచ్రేకర్
  • అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగకపోవడంపై విమర్శలు
  • ద్రోణాచార్య, పద్మశ్రీ పురస్కార గ్రహీతకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించిన శివసేన

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కోచ్ రమాకాంత్ అచ్రేకర్ 87 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. బుధవారంనాడు ముంబైలో ఆయన కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు నిన్న జరిగాయి. ఈ కార్యక్రమానికి సచిన్, వినోద్ కాంబ్లీలతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు హాజరయ్యారు. మరోవైపు, అచ్రేకర్ కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగకపోవడాన్ని పలువురు తప్పుపడుతున్నారు.

మహారాష్ట్ర ప్రభుత్వంపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. ద్రోణాచార్య, పద్మశ్రీ పురస్కారాలను అందుకున్న వ్యక్తికి మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? అని మండిపడ్డారు. అచ్రేకర్ పట్ల ప్రభుత్వం అగౌరపూర్వకంగా వ్యవహరించిందని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలన్నింటికీ సచిన్ దూరంగా ఉండాలని సూచించారు.

ఈ అంశంపై మహారాష్ట్ర మంత్రి ప్రకాశ్ మెహతా మాట్లాడుతూ, కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే తప్పిదం జరిగిందని తెలిపారు. జరిగిన దానికి చింతిస్తున్నామని అన్నారు. అచ్రేకర్ అంత్యక్రియలకు ప్రభుత్వం తరపున ఈయన హాజరయ్యారు. 

More Telugu News