Uttar Pradesh: మోదీ పాలనలో భద్రత లేదని అన్నారో.. బాంబులతో లేపేస్తా!: బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్

  • కొందరు ద్రోహులు భద్రత లేదంటున్నారు
  • నాకు ఓసారి హోంశాఖ ఇచ్చిచూడండి
  • ‘వందేమాతరం’ ఆపేయడంపై ఆవేదన

ఉత్తరప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ లో భద్రత కరవయిందని చెప్పేవారిని బాంబులతో లేపేయాలని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తంగా నీరాజనాలు అందుకుంటున్నారని తెలిపారు. కానీ కొందరు ద్రోహులు మాత్రం భారత్ లో రక్షణ లేదంటూ వ్యాఖ్యానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లంతా ఎక్కడ క్షేమంగా ఉంటామని భావిస్తారో, అక్కడికే వెళ్లిపోవాలని స్పష్టం చేశారు.

లేదంటే తనకు హోంశాఖ ఇవ్వాలనీ, ఒకవేళ తనకు హోంశాఖ ఇస్తే ఇలా మాట్లాడుతున్న వారందరినీ బాంబులతో లేపేస్తానని హెచ్చరించారు. బీజేపీ తప్ప మిగతా పార్టీలన్నీ వందేమాతరం గీతాలాపనను విస్మరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ సెక్రటేరియట్ లో వందేమాతరం ఆలాపనపై సంప్రదాయాన్ని కాంగ్రెెస్ ప్రభుత్వం నిలిపివేయడాన్ని తప్పుపట్టారు. చివరగా ఇదంతా తన వ్యక్తిగత వ్యాఖ్యలనీ, దీనికి పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేశారు.

More Telugu News