Andhra Pradesh: జేసీ దివాకర్ రెడ్డి చంద్రబాబును తిడుతున్నాడో.. పొగుడుతున్నాడో అర్థం కావట్లేదు!: జీవీఎల్

  • చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు
  • రూ.500 కోట్లు పెట్టి 2 స్థానాలు దక్కించుకున్నారు
  • ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బీజేపీ నేత

ఆంధ్రప్రదేశ్ కు మిగతా రాష్ట్రాల కంటే రెట్టింపు నిధులు వచ్చాయని అప్పటి ప్రభుత్వంలో పనిచేసిన ఉన్నతాధికారి దినేశ్ కుమార్ చెప్పారని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఎన్డీయే కూటమి నుంచి విడిపోయాక కూడా ఏపీకి ఉపాధి హామీకింద రూ.6,000 కోట్లు ఇచ్చామని ప్రధాని మోదీ స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. కానీ ‘అంతా మేమే చేశాం’ అని టీడీపీ ప్రభుత్వం చెప్పుకోవడం సరికాదన్నారు. చేసిన సహాయాన్ని మరిచి ఏ చెట్టు కొమ్మపై కూర్చున్నామో దాన్నే నరుక్కున్న ఘనత చంద్రబాబుదని దుయ్యబట్టారు. ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

చంద్రబాబు ఉదయాన్నే రోజుకో కొత్త డ్రామా స్క్రిప్ట్ రాస్తున్నారనీ, అందుకు అనుగుణంగా టీడీపీ పార్లమెంటు సభ్యులు గోల చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో రూ.500 కోట్లు ఇచ్చి 2 సీట్లు తెచ్చుకున్నారంటే రేపు ఏపీలో ఎంత ఖర్చు పెట్టబోతున్నారో అర్థం అవుతుందని వ్యాఖ్యానించారు. రెండంతస్తుల హైకోర్టు భవనాన్ని కట్టలేకపోయిన చంద్రబాబు ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద నగరాన్ని నిర్మిస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. ఇక పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి చంద్రబాబును తిడుతున్నాడో.. పొగుడుతున్నాడో.. అర్థం కాకుండా మాట్లాడతాడని జీవీఎల్ ఎద్దేవా చేశారు.

More Telugu News