Karnataka: కన్నడ నటీనటుల ఇళ్లలో కేజీల కొద్దీ బంగారం... నేడూ ఐటీ దాడులు!

  • నిన్నటి నుంచి శాండల్ వుడ్ పై ఐటీ దాడులు
  • భారీ ఎత్తున ఆస్తి పత్రాలు స్వాధీనం
  • బీజేపీ పనేనంటున్న అభిమానులు

శాండల్ వుడ్ సెలబ్రిటీలపై నిన్న దాడులు చేసిన ఐటీ అధికారులు, వారి ఇళ్లలో బ్యాగుల కొద్దీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. పునీత్, శివరాజ్ ఇళ్లలో రాత్రంతా సోదాలు చేసిన అధికారులు, నేడు కూడా వాటిని కొనసాగించారు. ఒకేసారి నలుగురు స్టార్ హీరోలు, అగ్ర నిర్మాతలు, నటి రాధిక ఇళ్లపై ఏకకాలంలో దాడులు జరుగగా, సుమారు 200 మందికి పైగా అధికారులు వీటిల్లో పాల్గొన్నారు.

 నిర్మాత రాక్ లైన్ వెంకటేష్, కిరంగందూరు విజయ్, ఎమ్మెల్సీ సీఆర్ మనోహర్, కిచ్చ సుదీప్, యశ్ తదితరుల ఇళ్లపైనా దాడులు జరుగుతున్నాయి. ఇక యశ్ ఇంట్లో భారీగా బంగారం బయటపడ్డట్టు తెలుస్తోంది. శివరాజ్, పునీత్, వెంకటేశ్ ఇళ్లలోనూ కిలోల కొద్దీ బంగారాన్ని అధికారులు గుర్తించారు.

 హీరోలు తీసుకుంటున్న పారితోషికాలు, వారు కడుతున్న పన్నుల వివరాలు, వారి పేరిట ఉన్న ఆస్తుల వివరాలను వీరు సేకరించారు. వీరి ఇళ్లలో విలువైన ఆస్తుల పత్రాలను అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ దాడుల తరువాత తాము ఏం గుర్తించామన్న విషయాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. బీజేపీ ప్రోద్బలంతోనే దాడులు జరుగుతున్నాయని హీరోల ఫ్యాన్స్, ప్రజా ప్రతినిధులు ఆరోపిస్తుండగా, అటువంటిదేమీ లేదని బీజేపీ నేతలు అంటున్నారు.

More Telugu News