ram gopal varma: రామ్ గోపాల్ వర్మపై విరుచుకుపడ్డ నాదెండ్ల భాస్కరరావు

  • ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచింది నేనా? లేక అతని కుటుంబసభ్యులా?
  • వర్మ పెద్ద మనిషి అని ఇన్నాళ్లు అనుకున్నా
  • నిజాలు తెలుసుకుని మాట్లాడాలి

దివంగత ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి నాదెండ్ల భాస్కరరావు సీఎం కూర్చీని లాక్కున్నారని... ఇప్పుడు జనసేనలో నెంబర్-2గా కొనసాగుతున్న ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ పవన్ కల్యాణ్ కు వెన్నుపోటు పొడుస్తారంటూ వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై నాదెండ్ల భాస్కరరావు మండిపడ్డారు. వర్మ వ్యాఖ్యలను ఖండించిన ఆయన... రాజకీయాల్లో ఉన్న యంగ్ స్టార్స్ ను ప్రోత్సహించాలని, ఇలాంటి వ్యాఖ్యలతో వారిని నిరుత్సాహపరచకూడదని అన్నారు. ఇన్నాళ్లు వర్మ పెద్ద మనిషి అని తాను అనుకున్నానని... నోటికొచ్చినట్టు మాట్లాడుతూ, ఆయన తనను తాను తగ్గించుకున్నారని చెప్పారు.

సినిమాల్లో ఊహాగానాలు ఉంటాయని, కానీ వాస్తవ ప్రపంచంలో ఊహాగానాలకు తావు ఉండదని నాదెండ్ల తెలిపారు. 'కీలుగుర్రం' సినిమాలో మబ్బుల్లోంచి నాగేశ్వరరావు గుర్రం ఎక్కి వస్తారని... నిజంగానే ఆయన గుర్రం ఎక్కి వస్తారేమోనని తాను అనుకునేవాడినని... వర్మ మాటలు కూడా అలాగే ఉన్నాయని చెప్పారు. వర్మ నిజాలు తెలుసుకోవాలని... వెన్నుపోటు పొడిచేది ఎవరో గ్రహించాలని తెలిపారు. పవన్, మనోహర్ ఇద్దరూ పిల్లలని... వారి పని వారు చేసుకుంటున్నారని... వారితో తనను ముడిపెట్టి మాట్లాడటం సరికాదని అన్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచింది నేనా? లేక అతని కుటుంబసభ్యులా? అని ప్రశ్నించారు. 

More Telugu News