Telangana: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

  • ఆర్.కృష్ణయ్యకు షాకిచ్చిన కోర్టు
  • ఆర్డినెన్స్ కొట్టివేతకు అనుమతి నో
  • విచారణ నాలుగువారాలు వాయిదా

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. బీసీ రిజర్వేషన్ ను 34 నుంచి 22 శాతానికి తగ్గిస్తూ జారీచేసిన ఆర్డినెన్స్ ను కొట్టివేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ జారీచేసినందున ఎన్నికల నిలిపివేతకు ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో ఈ విషయంలో పిటిషన్ దాఖలు చేసిన బీసీ జాతీయ సంఘం నేత ఆర్.కృష్ణయ్యకు చుక్కెదురైంది.

ఈ పిటిషన్ విచారణ సందర్భంగా కృష్ణయ్య తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రిజర్వేషన్ తగ్గింపు వల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ ఆర్డినెన్స్ ను వెంటనే రద్దు చేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రస్తుత పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

More Telugu News