Pawan Kalyan: ఎన్నికల కార్యాచరణను ప్రకటించిన పవన్ కల్యాణ్

  • ఎన్నికల కోసం జనసేన రాలేదు
  • భావితరాల పాతికేళ్ల భవిష్యత్తు కోసమే జనసేన
  • చట్ట సభల్లోకి కొత్త తరం అడుగు పెట్టాల్సిన అవసరం ఉంది

జనసేన పార్టీ ఎన్నికల కోసం రాలేదని... భావితరాల పాతికేళ్ల భవిష్యత్తు కోసం పోరాటం చేయడానికి, ప్రజలకు మరింత మెరుగైన జీవితాన్ని అందించేందుకు వచ్చిందని జనసేనాని పవన్ కల్యాణ్ తెలిపారు. యువత ఆశయాలను నెరవేర్చేందుకే గత కొన్ని నెలలుగా తాము ప్రజా పోరాట యాత్రలో భాగంగా కానీ, మరో విధంగా కానీ తిరుగుతున్నామని చెప్పారు. ఆడపడుచుల ఆకాంక్షలను అర్థం చేసుకుంటూ తాము ముందుకెళుతున్నామని అన్నారు.

2014లో తాము కొన్ని పార్టీలకు మద్దతు తెలిపామని... తెలుగు ప్రజల సుస్థిరత కోసం ఆరోజు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని పవన్ తెలిపారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర సమతుల్యత కోసం మొత్తం 175 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. వామపక్షాలను మాత్రమే తమతో కలుపుకుంటామని... అధికార, ప్రతిపక్షాలతో కలసి ముందుకు సాగబోమని తెలిపారు. ఇతర పార్టీలతో తాము కలుస్తున్నామని... తమకు కొన్ని స్థానాలను వారు కేటాయించారంటూ... జనసేన శ్రేణులను అయోమయంలో పడేసేలా రకరకాల వార్తలను ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

యువతకు బంగారు భవిష్యత్తును అందించాలనేదే తమ ఆశయమని... అందుకే కొత్తదనంతో కూడిన నాయకత్వం వైపు తాము చూస్తున్నామని పవన్ తెలిపారు. మంచివారు, అనుభవజ్ఞులైన నాయకులకు స్థానం కల్పిస్తామని... ఇదే సమయంలో 175 స్థానాల్లో మహిళలు, యువతకే ఎక్కువ అవకాశం ఇవ్వబోతున్నామని చెప్పారు. చట్ట సభల్లోకి కొత్త తరం అడుగుపెట్టాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు తాము వ్యూహం రచిస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలను జనసైనికులంతా తమతమ స్థాయుల్లో ఖండించాలని పిలుపునిచ్చారు. 

More Telugu News