Andhra Pradesh: చంద్రబాబును టార్గెట్ చేస్తూ మోదీ రాక్షసానందం పొందుతున్నారు!: బుద్ధా వెంకన్న

  • రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులకు దిగుతున్నారు
  • ఏపీ బీజేపీ నేతలకు బాబు వల్లే పదవులు వచ్చాయి
  • విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించిన వెంకన్న

ఏపీ సీఎం చంద్రబాబును టార్గెట్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ రాక్షసానందం పొందుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. ప్రధానిగా దేశాన్ని పట్టించుకోవడం మానేసిన మోదీ, రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులకు దిగుతున్నారని దుయ్యబట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు సహకారంతో పదవులు దక్కించుకున్న రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పుడు ఆయన్నే విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో బుద్ధా వెంకన్న మాట్లాడారు.

దేశాన్ని అభివృద్ధి చేసే విషయాన్ని పక్కన పెట్టిన మోదీ ఇప్పుడు చంద్రబాబును టార్గెట్ చేస్తూ, చంద్రబాబును విమర్శించేవారిని అభినందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో సహకారం అందనప్పటికీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై టీడీపీ ప్రభుత్వం ముందుకు పోతోందని గుర్తుచేశారు. ఏపీలో నాలుగేళ్లలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో చూసి నేర్చుకోవాలని మోదీకి సూచించారు.

తెలంగాణలో మహాకూటమికి 21 సీట్లు వచ్చాయనీ, బీజేపీకి కేవలం ఒకే సీటు వచ్చిందని తెలిపారు. బీజేపీకి తెలంగాణలో 109 చోట్ల డిపాజిట్ రాలేదనీ, దీనిపై మాట్లాడని మోదీ, టీడీపీని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ, వైసీపీ అధినేత జగన్ కుమ్మక్కు అయి చంద్రబాబును టార్గెట్ చేసుకున్నారని ఆరోపించారు.

More Telugu News