New Delhi: పొగమంచుతో.. ఢిల్లీలో విమాన ప్రయాణికులకు ఇక్కట్లు!

  • పొగమంచుతో ఎక్కడి విమానాలు అక్కడే
  • ఉదయం 7.30 గంటల నుంచి నిలిచిన టేకాఫ్‌
  • ఢిల్లీలో దిగాల్సిన మూడు విమానాలు వేరేచోటుకి మళ్లింపు

ఢిల్లీలో విమానాల కోసం ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. దట్టంగా పొగమంచు కురుస్తుండడంతో ఈరోజు ఉదయం 7.30 గంటల నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల టేకాఫ్‌ను నిలిపివేశారు. అదే సమయంలో విమానాశ్రయంలో ల్యాండ్‌ కావాల్సి ఉన్న మూడు విమానాలను వేరే ప్రాంతాలకు మళ్లించారు.

ప్రముఖ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ అసౌకర్యాన్ని తెలియజేస్తూ ఈ మేరకు ట్వీట్‌ చేసింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఆ ప్రభావం, ఢిల్లీ నుంచి బయలుదేరాల్సిన, అక్కడికి వెళ్లాల్సిన విమానాలపై పడిందని పేర్కొంది. మరోవైపు విమానాలు నిలిచి పోవడంతో విమానాశ్రయంలో భారీ సంఖ్యలో ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. షెడ్యూల్‌ ప్రకారం సమయానికి చేరుకున్న ప్రయాణికులు ఎప్పటికి పరిస్థితి కుదురుపడుతుందో అర్థంకాక సతమతమవుతున్నారు.

More Telugu News