kollywood: కేజీఎఫ్ హీరో యశ్ కు షాకిచ్చిన హైకోర్టు.. ఇంటిని ఖాళీ చేయాలని ఆదేశం!

  • అద్దె చెల్లించని యశ్ తల్లి పుష్ప
  • మార్చి 31లోగా అద్దె చెల్లించాలని ఉత్తర్వులు
  • నగదు మొత్తం చెల్లించేందుకు యష్ సంసిద్ధత

కేజీయఫ్ సినిమాతో తెలుగువారికి పరిచయమైన హీరో యశ్ కు షాక్ తగిలింది. ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటి యజమానులకు అద్దె చెల్లించి వెంటనే ఖాళీ చేయాలని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. ఇంటి మరమ్మతుల కోసం తాము పెట్టిన ఖర్చును బాడుగగా పరిగణించాలన్న యశ్ కుటుంబ సభ్యుల విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది.

బనశంకరి మూడవస్టేజీలోని ఆరవ బ్లాక్‌లో నెలకు రూ.40 వేలు చెల్లిస్తూ యశ్‌ కుటుంబం అద్దెకు ఉంటోంది. ఈ నేపథ్యంలో 2015లో ఈ ఇంటిని ఖాళీ చేయాలని యజమానులైన మునిప్రసాద్, వనజా దంపతులు కోరారు. అయితే ఇందుకు యశ్ తల్లి పుష్ప అంగీకరించలేదు. ఇంటి రిపేరు కోసం తాము రూ.12.50 లక్షలు ఖర్చు పెట్టామని వాదించారు. వీటిని అద్దెలో కట్ చేసుకోవాలని కోరారు.

ఇందుకు యజమానులు అంగీకరించకపోవడంతో ఆమె బెంగళూరు సివిల్ కోర్టును ఆశ్రయించారు. అక్కడ యజమానులకు అనుకూలంగా తీర్పు రావడంతో హైకోర్టుకు వెళ్లారు. తాజాగా అక్కడ కూడా పుష్పకు చుక్కెదురు అయింది. ఇంటి యజమానులకు బాకీ పడ్డ రూ.23 లక్షల అద్దెను 2019, మార్చి 31లోగా చెల్లించి, ఇంటిని ఖాళీ చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కాగా, సినీ పరిశ్రమలోని కొందరు పెద్దల కుట్ర కారణంగానే ఈ ఇబ్బంది తలెత్తిందని పుష్ప ఆరోపించారు. వాళ్లు అంతగా దిగజారుతారని అనుకోలేదన్నారు.

More Telugu News