Andhra Pradesh: అగ్రిగోల్డ్ ఎఫెక్ట్.. మనస్తాపంతో ప్రాణాలు కోల్పోయిన ఏజెంట్!

  • ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలో ఘటన
  • పెట్టుబడులపై ప్రశ్నించిన ప్రజలు
  • గుండెపోటుతో మృతిచెందిన తాతారావు

ఆంధ్రప్రదేశ్ లో అగ్రిగోల్డ్ వ్యవహారం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఏపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తుల విషయంలో హైకోర్టు మార్గదర్శకాల మేరకు ముందుకు పోతుంటే, ఏపీ ప్రభుత్వం బాధితులను వెంటనే ఆదుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్ సంస్థలో ఏజెంట్ గా పనిచేసిన ఓ వ్యక్తి ఈరోజు గుండెపోటుతో మృతి చెందారు.

విశాఖపట్నం జిల్లా నాగులపల్లికి చెందిన తాతారావు అగ్రిగోల్డ్ ఏజెంట్ గా పనిచేశారు. అప్పట్లో తనకున్న పరిచయాలతో చాలామంది చేత పెట్టుబడులు పెట్టించారు. చివరికి ఆ సంస్థ చేతులు ఎత్తేయడంతో బాధితులు తాతారావును ప్రశ్నించడం మొదలుపెట్టారు.

ఈ నేపథ్యంలో మనస్తాపానికి లోనైన తాతారావుకు ఈరోజు ఉదయం గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తాతారావు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News