Delhi: దేశ రాజధానిలో 42 ఏళ్ల మహిళపై ఆటోలో గ్యాంగ్ రేప్.. ఐదుగురి అరెస్ట్

  • దేశ రాజధానిలో దారుణం
  • 42 ఏళ్ల మహిళను ఆటోలో తిప్పుతూ అత్యాచారం
  • నిందితులందరూ ఆటో డ్రైవర్లే

దేశ రాజధానిలో మరో దారుణం జరిగింది. నడుస్తున్న ఆటోలో ఓ మహిళపై కొందరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం సృహ కోల్పోయిన మహిళను ఓ దాబా పక్కనే పడేసి పరారయ్యారు. ఆరుగురు నిందితుల్లో ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరొకరి కోసం గాలిస్తున్నారు. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఢిల్లీకి చెందిన 42 ఏళ్ల మహిళ భర్త గురుగ్రామ్‌లోని ఓ కంపెనీలో పనిచేస్తుండగా ఐదేళ్ల క్రితం మరణించాడు. కంపెనీ నుంచి తన భర్తకు డబ్బులు రావాల్సి ఉండడంతో సమస్యను పరిష్కరించుకుని డబ్బులు తెచ్చుకునేందుకు మహిళ నఖ్‌రోలా చౌక్‌లో మధ్యాహ్నం 2:20 గంటల సమయంలో ఆటో ఎక్కింది. ఆమెను ఐఎంటీ-మనేసర్‌కు తీసుకెళ్లాల్సిన ఆటో డ్రైవర్ అంకిత్ ఆమెను మరో ఆటో డ్రైవర్ దీపక్ రూముకు తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి  అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రి 9 గంటలకు ఆమెను ఆటోలో తీసుకెళ్లిన నిందితులు బాధితురాలిని మరో ముగ్గురికి అప్పగించారు. వారందరూ కలిసి అదే ప్రాంతంలో ఆటోను తిప్పుతూ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు.

అనంతరం స్పృహ కోల్పోయిన ఆమెను రాంపురా ఫ్లై ఓవర్ సమీపంలో ఉన్న ఓ దాబా వద్ద పడేసి వెళ్లిపోయారు. స్పృహ కోల్పోయి పడి ఉన్న బాధితురాలిని చూసిన కొందరు పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. మరొకరి కోసం గాలిస్తున్నారు.

More Telugu News