loksabha: ద్రవ్యలోటు కట్టడికి కేంద్రానికి ఆర్బీఐ నిధులు అవసరం లేదు: అరుణ్ జైట్లీ స్పష్టీకరణ

  • అదనపు వ్యయం బిల్లును ఆమోదించిన లోక్ సభ  
  • ద్రవ్యలోటు అదుపు చేయడంలో సమర్ధంగా పని చేశాం
  • ఆర్బీఐ 28 శాతం రిజర్వ్ నిధులు కలిగి ఉంది

ఆర్బీఐ రిజర్వ్ నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం చూస్తోందంటూ వస్తున్న విమర్శలను ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ మరోసారి ఖండించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అదనపు వ్యయంగా అవసరమైన రూ.85,948.86 కోట్లకు సంబంధించిన బిల్లును ఈరోజు లోక్ సభలో ఆమోదించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో భాగంగా జైట్లీ మాట్లాడుతూ, ద్రవ్యలోటు కట్టడికి కేంద్రానికి ఆర్బీఐ నిధులు అవసరం లేదని స్పష్టం చేశారు.

ఆ నిధులను పేదరిక నిర్మూలన కార్యక్రమాలను చేపట్టడానికి, ప్రభుత్వ రంగ బ్యాంకులకు నిధులు సమకూర్చడానికి వినియోగించాలనుకున్నామని చెప్పారు. ద్రవ్యలోటును అదుపులో ఉంచడంలో కేంద్ర ప్రభుత్వం సమర్ధవంతంగా పని చేసిన రికార్డు ఉందని గుర్తుచేశారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కేంద్ర బ్యాంకులకు 8 శాతం రిజర్వ్ నిధులు ఉండగా, సంప్రదాయ దేశాల్లో మాత్రం అది 14 శాతంగా ఉందని చెప్పారు. కానీ, ఆర్బీఐ మాత్రం 28 శాతం రిజర్వ్ నిధులు కలిగి ఉందని, ఆ పరిమితిని నిపుణుల సంఘం త్వరలో నిర్ణయిస్తుందని అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. 

More Telugu News