Telangana: భార్యతో గొడవ పడి.. కుమార్తెను రెండో అంతస్తు నుంచి విసిరేసిన భర్త!

  • తీవ్రంగా గాయపడ్డ చిన్నారి
  • హైదరాబాద్ లోని నాచారంలో ఘటన
  • కేసు నమోదుచేసిన పోలీసులు

భార్యతో గొడవ పడ్డ ఓ వ్యక్తి విచక్షణను కోల్పోయాడు. కన్నబిడ్డ అని కూడా చూడకుండా కుమార్తెను రెండో అంతస్తు నుంచి విసిరేశాడు. అనంతరం ఇంటి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

మహారాష్ట్రకు చెందిన మనోజ్, జాహ్నవి దంపతులు నగరంలోని నాచారం మల్లాపూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. డీసీఎం డ్రైవర్ గా పనిచేస్తున్న మనోజ్ భార్యతో తరచూ గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం మద్యం తాగివచ్చిన మనోజ్ భార్యతో మరోసారి గొడవపడ్డాడు.

ఈ క్రమంలో 8 నెలల చిన్నారిని ఆగ్రహంతో రెండో అంతస్తు నుంచి కిందకు విసిరేశాడు. చిన్నారిని గమనించిన స్థానికులు వెంటనే పాపను గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా, తీవ్రంగా గాయపడ్డ చిన్నారి ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News