Khammam District: ఖమ్మం జిల్లాలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నిరసన

  • తెలంగాణ సీఎం దిష్టిబొమ్మ దహనం
  • ఏపీ సీఎంపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌
  • టీఆర్‌ఎస్‌ అధినేతవి విచక్షణలేని మాటలని ధ్వజం

ఖమ్మం జిల్లాలో టీడీపీ శ్రేణులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టాయి. ఇందులో భాగంగా కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఖమ్మం జిల్లా టీడీపీ అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో మణుగూరు పట్టణంలోని టీడీపీ సెంటర్‌లో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. అక్కడే కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనం చేశాయి.

ఈ సందర్భంగా బ్రహ్మయ్య మాట్లాడుతూ ఈరోజు సీఎంగా కేసీఆర్‌ విర్రవీగుతున్నారని, కానీ ఆయనకు రాజకీయ జీవితాన్నిచ్చిందని చంద్రబాబునాయుడు అన్న విషయం మర్చిపోయారని ధ్వజమెత్తారు. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తొలిసారి అధికారంలోకి వచ్చాక అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఎన్నికల్లో గెలిచిన విషయాన్ని ప్రజలు గమనించారన్నారు.

కేసీఆర్‌ అహంకారంతో రగిలిపోతున్నారని, త్వరలోనే తగిన శాస్తి జరుగుతుందని అన్నారు. ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుండా రాష్ట్రాల పర్యటనకు వెళ్లిన కేసీఆర్‌ ఆక్కడ సానుకూలత వ్యక్తం కాకపోవడంతో ఆ అక్కసును చంద్రబాబుపై తీర్చుకుంటున్నారని చెప్పారు. ప్రజలు ఏమీ గమనించడం లేదనుకుంటే పొరపాటని, సమయం వచ్చినప్పుడు వారే బుద్ధిచెబుతారని అన్నారు.

More Telugu News