Uttar Pradesh: నడిరోడ్డుపై మహిళను వివస్త్రను చేసి.. వీధుల్లో పరుగులు పెట్టించిన యువకుడు!

  • ఉత్తరప్రదేశ్‌లో అంతూపొంతు లేకుండా పోతున్న దారుణాలు
  • తనకు వార్నింగ్ ఇచ్చిన మహిళపై కక్ష
  • ఇంటికి వెళ్లి దాడిచేసి వివస్త్రను చేసిన యువకులు

ఉత్తరప్రదేశ్‌లో దారుణాలకు అంతూపొంతు లేకుండా పోతోంది. మహిళలు కనిపిస్తే చాలు మృగాళ్లు రెచ్చిపోతున్నారు. టీజ్ చేసిన తనకు ఓ మహిళ వార్నింగ్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయిన యువకుడు సభ్యసమాజం తలదించుకునే పనిచేశాడు. ఆమె ఇంటికి వెళ్లి బయటకు లాక్కొచ్చి దాడిచేసి, వివస్త్రను చేసి నడి బజార్లో పరుగులు పెట్టించాడు. ఉత్తరప్రదేశ్‌లోని భడోహి జిల్లా గోపీగంజ్‌లో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. శనివారం సాయంత్రం ఓ మహిళ బజారు నుంచి ఇంటికి వస్తుండగా ఓ యువకుడు అడ్డగించి అసభ్యంగా ప్రవర్తించాడు. అతడిని ధైర్యంగా ఎదుర్కొన్న ఆమె వార్నింగ్ ఇచ్చింది. దీంతో అవమానభారంతో అక్కడి నుంచి వెనుదిరిగిన యువకుడు ఆమెపై కక్ష పెంచుకున్నాడు. విషయాన్ని తన స్నేహితులకు చెప్పాడు.

స్నేహితులు ముగ్గురిని వెంటబెట్టుకుని ఆమె ఇంటికి వెళ్లిన యువకుడు ఆమెను బయటకు లాక్కొచ్చి దాడి చేశాడు. వివస్త్రను చేసి వీధుల్లో పరుగులు పెట్టించాడు. భయంతో రోడ్లపై పరుగులు పెడుతున్న ఆమెను రక్షించాల్సిన స్థానికులు ఫొటోలు, వీడియోలు తీస్తూ పైశాచిక ఆనందం పొందారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నారు. నిందితుల చేతిలో గాయపడిన బాధితురాలిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

More Telugu News