Andhra Pradesh: ఆర్థిక కష్టాలతో విలవిల.. ఇద్దరు చిన్నారులతో కలిసి పురుగుల మందు తాగిన కుటుంబం!

  • తండ్రి, ఇద్దరు చిన్నారుల మృతి 
  • కొన ప్రాణాలతో చికిత్స పొందుతున్న తల్లి
  • ఏపీలోని విశాఖ జిల్లాలో దారుణం

ఆర్థిక కష్టాలతో ఓ కుటుంబం చితికి పోయింది. తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించేందుకు మార్గం లేకపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో తండ్రితో పాటు ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోగా, తల్లి కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో ఈరోజు చోటుచేసుకుంది.

విశాఖలోని కే. కోటపాడు మండలం చంద్రయ్యపేటకు చెందిన లక్ష్మణరావు విశాఖపట్నంలో కోళ్లఫారంలో పనిచేసేందుకు వచ్చారు. లక్ష్మణరావుకు భార్య లక్ష్మితో పాటు సిద్ధూ(6), వీణ(3) ఉన్నారు. ఈ నేపథ్యంలో లక్ష్మణరావు కుటుంబాన్ని ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. తీసుకున్న అప్పులను తీర్చేందుకు వస్తున్న ఆదాయం సరిపోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు.

ఆత్మహత్య చేసుకోవాలని వీరు నిర్ణయించుకున్నారు. అనంతరం భార్య లక్ష్మితో కలిసి చిన్నారులకు పురుగుల మందు తాగించాడు. ఆ తర్వాత భార్యతో కలిసి తానూ తాగాడు. కాగా, ఈ ఘటనలో లక్ష్మణరావుతో పాటు ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అయితే కొనప్రాణాలతో వున్న లక్ష్మిని గుర్తించిన స్థానికులు వెంటనే అంబులెన్సులో కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్లు తెలిపారు.

More Telugu News