Mother: ఆరు వేళ్లతో పుట్టిన పాప.. కొడవలితో వాటిని కోసిన తల్లి.. చిన్నారి మృతి

  • మధ్యప్రదేశ్‌లోని గిరిజన గ్రామంలో ఘటన
  • పెళ్లి కాదన్న భయంతోనే దారుణం
  • గాయాలపై పూతగా ఆవుపేడ

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. చేతులు, కాళ్లకు ఆరు వేళ్లతో జన్మించిన బిడ్డను చూసి తల్లి తల్లడిల్లింది. పెద్దయ్యాక ఆమెకు పెళ్లి కాదని భావించింది. ముందు జాగ్రత్త చర్యగా పాప కాళ్లు, చేతులకు ఉన్న అదనపు వేళ్లను కొడవలితో కోసేసింది. గాయాలపై ఆవు పేడ పూసింది. ఆ తర్వాత కాసేపటికే చిన్నారి మృతి చెందింది. మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లాలోని ఓ గిరిజన గ్రామంలో జరిగిందీ ఘటన.

ఈ నెల 22న చిన్నారి జన్మించింది. ఆమె కాళ్లు, చేతులకు ఆరేసి వేళ్లు ఉండడంతో కలత చెందిన తల్లి తారాబాయి వాటిని కొడవలితో తొలగించడంతో చిన్నారి మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. అదనపు వేళ్లు ఉండడంతో పెద్దయ్యాక కుమార్తెకు ఎక్కడ పెళ్లి కాదో అన్న భయంతోనే తారాబాయి వాటిని తొలగించిందని పోలీసులు వివరించారు.

చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించామని, నివేదిక రావాల్సి ఉందని ఎస్పీ రుచి వర్థన్ మిశ్రా తెలిపారు. తల్లిని అరెస్ట్ చేయలేదని పేర్కొన్నారు. పుట్టుకతో వచ్చిన శారీరక అసాధారణత (కాంజెనిటల్ ఫిజికల్ అనోమలీ) కారణంగా మనుషుల్లో కానీ, జంతువుల్లో కానీ బహుళ అంగుళీకత వస్తుందని వైద్యులు తెలిపారు.

More Telugu News