Secunderabad: సంక్రాంతి ప్రయాణానికి... హైదరాబాద్ నుంచి కాకినాడకు ప్రత్యేక రైళ్లు!

  • ఉన్న రైళ్లలో లభించని రిజర్వేషన్లు
  • వందల్లో వెయిటింగ్ లిస్టు
  • 11 నుంచి 13 మధ్య స్పెషల్ రైళ్లు

సంక్రాంతి పండగ సీజన్ లో స్వగ్రామాలకు వెళ్లాలని భావించే వారి సంఖ్య అధికంగా ఉండటంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు వెళ్లే వారితో అందుబాటులో ఉన్న రైళ్ల టికెట్లన్నీ బుక్ అయిపోయి, వెయిటింగ్ లిస్టు వందల్లోకి చేరిన వేళ, ఆరు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇవి సికింద్రాబాద్, కాచిగూడల నుంచి కాకినాడ టౌన్ వరకూ ప్రయాణిస్తాయని తెలిపింది.

జనవరి 11 నుంచి 13 మధ్య మూడు రైళ్లు కాకినాడకు బయలుదేరుతాయని, సికింద్రాబాద్ నుంచి రాత్రి 8 గంటలకు, కాచిగూడ నుంచి రాత్రి 9.15కు ఇవి కదులుతాయని తెలిపారు. మల్కాజిగిరి, ఖమ్మం, కాజీపేట మీదుగా ఇవి ప్రయాణిస్తాయని అధికారులు తెలిపారు. గత సంవత్సరం ప్రత్యేక రైళ్లను నడిపిన ద.మ.రై ఒక్కో రైలుపై రూ. 50 లక్షల వరకూ ఆదాయం పొందింది. కాగా, జనవరి 10న సికింద్రాబాద్ నుంచి మచిలీపట్నానికి ఓ ప్రత్యేక రైలును వేసినప్పటికీ, ప్రయాణికుల స్పందన అంతంతమాత్రంగా ఉండటంతో దాన్ని రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

More Telugu News