Budha venkanna: తల్లి కడుపులో నుంచి ఎందుకు బయటకు వచ్చామా అని బాధపడేలా చేస్తానన్న వైఎస్సార్ ఏమయ్యారో తెలుసుగా?: కేసీఆర్ కు బుద్ధా వెంకన్న కౌంటర్

  • ప్రత్యేక హోదాకు వ్యతిరేకమని హరీశ్ చెప్పారు
  • మోదీ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివారు
  • కేసీఆర్, జగన్.. మోదీ మోచేతి నీళ్లు తాగుతున్నారు
  • చంద్రబాబు తెలంగాణ ఇవ్వొద్దని చెప్పలేదు

తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీ సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న నిప్పులు చెరిగారు. "అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి గారు ఏం చెప్పారో గుర్తుందిగా.. ‘తల్లి కడుపులో నుంచి ఎందుకు బయటకు వచ్చామా? అని బాధపడేలా చేస్తా’ అన్న ఆయన ఏమయ్యారో తెలుసుగా.." అంటూ కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు.

నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సాక్షాత్తు నీ కుమారుడు కేటీఆర్ గారు.. ఈ రాష్ట్రానికి ఐటీ తీసుకువచ్చింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు. నేడు ప్రత్యేక హోదాకు సపోర్టని మీరు చెబుతున్నారు. మీ సపోర్ట్ ఎక్కడ? మొన్న ఎన్నికల ప్రసంగంలో మీ అల్లుడు హరీష్ రావు ‘ప్రత్యేక హోదాకు వ్యతిరేకం’ అన్నారు. ఈ మాటలన్నీ మరచిపోయి ప్రధాని మోదీగారు ఏదైతే రాసిచ్చారో అదే ఈరోజు మాట్లాడారు. చాలా తప్పు. ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలంతా నీలాంటి వ్యక్తి మాటలు విని సిగ్గు పడుతున్నారు.

పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులెవరూ ఏపీ గురించి మాట్లాడటం లేదు. తెలుగువాడివయ్యుండి.. సహకరించాల్సింది పోయి మోదీ చెప్పినట్టు మాట్లాడుతున్నావు. 2009లో నీకొచ్చిన సీట్లు చంద్రబాబు నాయుడిగారి దయాదాక్షిణ్యాలపై వచ్చినవి కావా? నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారు నీ పార్టీని సర్వ నాశనం చేసి.. విలీనం చేసుకుందామనుకుంటే మీరు భయపడి.. చంద్రబాబు నాయుడిగారి కూటమిలో జాయిన్ అయ్యారు.

కేటీఆర్‌గారు మొదట సిరిసిల్లలో మహాకూటమి కారణంగానే ఎమ్మెల్యే అయ్యారు. మీరా చంద్రబాబు నాయుడి గారి నాయకత్వం గురించి మాట్లాడేది? చంద్రబాబు నాయుడు గారు కూడా తెలంగాణ కోసం పోరాడారు. రెండు రాష్ట్రాలకూ న్యాయం చేయమని చెప్పారు కానీ తెలంగాణ ఇవ్వొద్దని చెప్పలేదు. మోదీకి ఉన్న అక్కసంతా నేడు మీ మాటల్లో కక్కించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కేసీఆర్ తాకట్టుపెట్టారు. కేసీఆర్, వైసీపీ అధినేత జగన్.. మోదీ మోచేతి నీళ్లు తాగి ఈ రాష్ట్రం మీద విషం కక్కుతున్నారు.

1996-99 మధ్యలో జరిగిన టీడీపీ శిక్షణ తరగతుల్లో మీరేం చెప్పారో గుర్తు చేసుకోండి. శిక్షణ తరగతులు నడిపించిందీ.. చంద్రబాబు నాయుడుగారి గురించి గొప్పగా చెప్పింది మీరు కాదా? అలాంటి మీరు మోదీ గారు ఏదో రాసిస్తే వచ్చి దానిని చదివి వినిపిస్తారా? ఈ ఐదు రోజులు ఎక్కడెక్కడ తిరిగారు? ఏం చేశారు? అనేది చెప్పాల్సిన మీరు చంద్రబాబుగారిని విమర్శిస్తారా? అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి గారు ఏం చెప్పారో గుర్తుందిగా.. ‘తల్లి కడుపులో నుంచి ఎందుకు బయటకు వచ్చామా? అని బాధపడేలా చేస్తా’ అని, ఆయన ఏమయ్యారో తెలుసుగా?

చంద్రబాబుగారు.. రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఆయన నిజాయతీ గల వ్యక్తి. ప్రజల కోసం పోరాడే వ్యక్తి కాబట్టి ఒక్క మాట కూడా మాట్లాడరు. కానీ ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఇవ్వాళ ఎన్నికలు అయిపోయాయి.. ఒడ్డున కూర్చున్నాం కాబట్టి ఏమన్నా చెల్లుతుందనుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఇకనైనా మోదీ ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడటం మాని చేస్తే చేతనైన సాయం చేయండి.. లేదంటే నోరు మూసుకుని కూర్చోండి కానీ మా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అవాకులు, చవాకులు పేలితే చరిత్ర హీనుడిగా మిగిలిపోతావని కేసీఆర్ గారికి తెలియజేస్తున్నా’’ అంటూ బుద్ధా వెంకన్న మండిపడ్డారు.

More Telugu News