Uttar Pradesh: మాయదారి ఎలుకలు.. పోలీస్ స్టేషన్‌లో పడి 1000 లీటర్ల మద్యాన్ని తాగేశాయి!

  • క్యాన్లలో భద్రపరిచిన పోలీసులు
  • ఎలుకల గుంపు తాగేసిందన్న ఎస్పీ
  • సర్వత్ర విస్మయం

ఉత్తరప్రదేశ్‌లోని ఎలుకలు అలాంటి ఇలాంటివి కావు. బొత్తిగా తాగుబోతులు. ఓ గ్యాంగ్‌లా ఏర్పడి దొరికిన మద్యాన్ని దొరికినట్టు ఊదేస్తున్నాయట. ఈ విషయాన్ని స్వయంగా పోలీసులే చెప్పారు. తాగుబోతు ఎలుకల తీరు ఇప్పుడు పోలీసుల పీకల మీదికి వచ్చింది. ఉన్నతాధికారులు ఏకంగా దర్యాప్తునకు ఆదేశించడం విశేషం. ఇంతకీ ఏం జరిగిందంటే..

బరేలీ ప్రాంతంలో ఇటీవల భారీగా పట్టుబడిన అక్రమ మద్యాన్ని పోలీసులు బరేలీ పోలీస్ స్టేషన్‌లోని ఓ గదిలో పెట్టి తాళం వేశారు. రెండు రోజుల క్రితం సీజ్ చేసిన మద్యాన్ని పరిశీలించేందుకు పోలీస్ స్టేషన్ హెడ్ క్లర్క్ నరేశ్ గది తలుపులు తెరిచి లోపలికి వెళ్లి చూసి ఆశ్చర్యపోయాడు. క్యాన్లలో చుక్క మద్యం కూడా లేదు. అవన్నీ ఖాళీగా కనిపించాయి. క్యాన్లకు రంధాలు ఉన్నాయి. ఆ గదిలో ఎలుకలు పరుగులు పెడుతుండడంతో ఇదంతా వాటి పనేనని పోలీసులు తేల్చారు. మొత్తం వెయ్యి లీటర్ల మద్యాన్ని ఎలుకల గుంపు తాగేసిందని ఎస్పీ అభినందన్ సింగ్ తెలిపారు.

ఆ ఎలుకల గ్యాంగ్‌ను తప్పకుండా పట్టుకుంటామని, భవిష్యత్తులో అవి స్టోర్ రూములోకి ప్రవేశించకుండా అడ్డుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు.  అంతేకాదు, ఈ ఘటనపై విచారణకు ఆదేశించనున్నట్టు తెలిపారు. విచిత్రం ఏమిటంటే.. సీజ్ చేసిన మద్యాన్ని నమూనాలు, చట్టపరమైన ప్రొసీడింగ్స్ కోసం కొంత మొత్తంలో సేకరించి మిగతా దానిని ధ్వంసం చేయాలి. అలా కాకుండా మొత్తం క్యాన్ల కొద్దీ దొరికిన మద్యాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌లో దాచడం, తర్వాత దానిని ‘ఎలుకలు’ తాగేయడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.

More Telugu News