ntr: నేను బజారువాడినని లక్ష్మీ పార్వతి తిట్టింది.. ఆమెకు బొమ్మ చూపిస్తా!: కేతిరెడ్డి వార్నింగ్

  • ఎన్టీఆర్ గొప్పతనాన్ని కుమారులు తీస్తున్నారు
  • నువ్వేమో డైలాగులు చెప్పుకుంటున్నావ్
  • లక్ష్మీ పార్వతిపై మండిపడ్డ కేతిరెడ్డి

తెలుగువారి అభిమాన నటుడు ఎన్టీఆర్ జీవితంపై క్రిష్ దర్శకత్వంలో ‘కథా నాయకుడు’, 'మహానాయకుడు' చిత్రాలు; రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తానూ ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ పేరుతో సినిమా తీస్తానని దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గతంలో ప్రకటించారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

ఎన్టీఆర్ కుమారులు తమ తండ్రి గొప్పతనాన్ని సినిమాగా తీసుకుంటున్నారని కేతిరెడ్డి తెలిపారు. లక్ష్మీ పార్వతికి అసలు ప్రజాదరణే లేదనీ, అసలు ఆమెకు ఎలివేషన్ అవసరం లేదని వ్యాఖ్యానించారు. ‘లక్ష్మీ పార్వతికి నిజంగా ప్రజాదరణ ఉండి, జనాలు ఆమెను చూసేందుకు కోకొల్లలుగా వస్తే ఏదోలే అనుకోవచ్చు. కానీ ఆమె మాత్రం ‘అప్పట్లో ఎన్టీఆర్ భార్యగా నేను 250 మంది ఎమ్మెల్యేలను గెలిపించాను. ఆయనకు వెన్నంటి ఉన్నాను’ అనే డైలాగులతోనే ఇప్పటికీ కాలం గడుపుతోంది. నా సామాజిక వర్గానికి చెందిన పార్టీలో ఉండి నన్ను బజారు వాడినని తిట్టింది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కానీ తాను గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చాననీ, అందుకే లక్ష్మీ పార్వతి మొదటి భర్త వీరగంథం సుబ్బారావు ఊరికి వెళ్లి అన్ని నిజాలను తెలుసుకున్నానని కేతిరెడ్డి తెలిపారు. ఆమె తన స్థాయికి మించి మాట్లాడుతోందని మండిపడ్డారు. నిజంగానే లక్ష్మీ పార్వతికి తాను షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వబోతున్నాననీ, ఆమెకు బొమ్మ చూపిస్తానని కేతిరెడ్డి హెచ్చరించారు.

More Telugu News