Tamilnadu: గర్భిణికి ఎయిడ్స్ రక్తం ఎక్కించిన కేసు... మనస్తాపంతో ఎలుకల మందు తిన్న రక్తదాత!

  • తమిళనాడులో కలకలం రేపిన ఘటన
  • బంధువు కోసం రక్తమిచ్చిన 19 ఏళ్ల యువకుడు
  • ఎయిడ్స్ ఉందని తరువాత వెలుగులోకి

తమిళనాడులో గర్భిణికి హెచ్ఐవీ రక్తాన్ని ఎక్కించిన ఘటన పెను దుమారాన్ని సృష్టిస్తున్న వేళ, ఆ రక్తాన్ని ఇచ్చిన దాత ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. తనకు ఎయిడ్స్ ఉందని తెలియకుండా రక్తాన్ని దానం చేసిన ఆ యువకుడు ఎలుకల మందు తిన్నాడు. తన బంధువుకు రక్తం అవసరం అయిన సమయంలో, ఆమె కోసం శివకాశీకి చెందిన 19 ఏళ్ల యువకుడు రక్తం దానం చేశాడు. అయితే, అప్పుడు రక్తం అవసరం పడకపోవడంతో దాన్ని పరీక్షించకుండానే బ్లడ్ బ్యాంక్ భద్రం చేసుకుంది. ఇప్పుడు ఆ రక్తాన్నే ఓ గర్భిణికి ఎక్కించారు.

ఇటీవల ఆ యువకుడు విదేశాలకు వెళ్లే నిమిత్తం ఫిట్ నెస్ టెస్ట్ లో భాగంగా రక్త పరీక్షలు చేయించుకోవడంతో హెచ్ఐవీ ఉన్నట్టు తేలింది. ఆ వెంటనే అతను బ్లడ్ బ్యాంకుకు వెళ్లి విషయాన్ని వివరించాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తన రక్తాన్ని ఓ గర్భిణికి ఎక్కించారని తెలిసింది. దీంతో తన వల్ల తన కుటుంబం ఇబ్బందుల పాలవుతుందని భావించిన సదరు యువకుడు మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం అతనికి రామనాథపురం ప్రభుత్వాసుపత్రి ఐసీయూలో చికిత్సను అందిస్తున్నారు.

More Telugu News