Chittoor District: పిల్లల్ని నగ్నంగా నిలిపినందుకు... జైలుపాలైన హెడ్ మిస్ట్రెస్ భువనేశ్వరి!

  • పుంగనూరులో కలకలం రేపిన ఘటన
  • ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • మెజిస్ట్రేట్ ఆదేశాలతో సబ్ జైలుకు తరలింపు

చిత్తూరు జిల్లా పుంగనూరు చైతన్య భారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థులను స్కూలు బయట నగ్నంగా నిలిపిన ఘటనలో హెడ్ మిస్ట్రెస్ భువనేశ్వరి, కరస్పాండెంట్ నాగరాజనాయుడులను పోలీసులు జైలుకు తరలించారు. ఘటనపై బాలల హక్కుల సంఘాలు స్పందించడం, కలెక్టర్ కల్పించుకుని విచారణకు ఆదేశించడంతో వీరిద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు, మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి, సబ్ జైలుకు తరలించారు. వీరిద్దరిపై ఐపీసీ సెక్షన్ 323 కింద కేసు పెట్టినట్టు పోలీసులు తెలిపారు.

కాగా, జరిగిన ఘటనపై నాగరాజనాయుడు వివరణ ఇస్తూ, విద్యార్థులు సరిగ్గా చదవడం లేదని, ఆ కారణంగానే కాసేపు ఎండలో నిలబెట్టామని చెప్పిన ఆయన, తమ శరీరంపై పురుగులు పడ్డాయని వారు చెప్పడంతోనే, బట్టలు విప్పి చూశామే తప్ప, మరేం జరగలేదని అన్నారు. విద్యార్థులను చదివేలా చేసేందుకు కొన్ని చర్యలు తప్పవని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా, స్కూలుపై విచారణ జరుగుతోందని, పాఠశాలను శాశ్వతంగా మూసివేయాల్సి వస్తే, ఇక్కడ చదువుతున్న 240 మందినీ మరో పాఠశాలలో చేరుస్తామని అధికారులు తెలిపారు.

More Telugu News