Kailash Vijayvargiya: రాహుల్ ప్రధాని అవ్వాలన్న కలలు కనడం ఆపేస్తే మంచిది: బీజేపీ

  • రాహుల్ ఎప్పటికీ ప్రధాని కాలేరు
  • పశ్చిమ బెంగాల్‌లోనూ ఓ పప్పు ఉన్నాడు
  • మమతా బెనర్జీపై తీవ్ర ఆరోపణలు

ప్రధాని కావాలన్న రాహుల్ గాంధీ కలలు ఎప్పటికీ నెరవేరవని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్‌వర్గియ అన్నారు. ప్రజలు తమ ప్రధానిగా నరేంద్ర మోదీని ఎప్పుడో ఎంపిక చేసుకున్నారని, కాబట్టి రాహుల్ ఇక తన కలలకు ఫుల్‌స్టాప్ పెట్టడం మంచిదని పేర్కొన్నారు. ‘‘మనందరికీ తెలుసు అక్కడో పప్పు ఉన్నాడని. తాను ప్రధాని అయిపోవాలని కలలు కంటున్నాడు’’ అని రాహుల్‌ను ఎద్దేవా చేశారు.

 ‘‘కానీ నేనో విషయం చెప్పదలిచాను. ఆయన కలలు ఎప్పటికీ కల్లలుగానే మిగిలిపోతాయి. మోదీని మళ్లీ ప్రధానిని చేయాలని దేశ ప్రజలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశారు’’ అని విజయ్ పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్‌ బీజేపీ తలపెట్టిన రథయాత్రకు మమత ప్రభుత్వం అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించడాన్ని వ్యతిరేకిస్తూ కృష్ణా నగర్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

పశ్చిమ బెంగాల్‌లోనూ ఓ పప్పు ఉన్నాడని, ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారని విమర్శించిన ఆయన అది ఎవరన్నది చెప్పకపోవడం గమనార్హం. మమతా బెనర్జీ ప్రభుత్వం చొరబాటుదార్లకు తాయిలాలు ఇచ్చి ఓటు బ్యాంకును భద్రపరుచుకుంటోందని విజయ్‌వర్గియ ఆరోపించారు.

More Telugu News